అతను ఓ సామాన్యుడే ! ఆశయం మాత్రం గొప్పది ! కానీ ఆ సంకల్పానికి బీజం పడింది మాత్రం ఆ ఒక్క సంఘటనతోనే !! వరదల్లో ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు సొంతంగా ఓ ఇంటిని కట్టించి ఇచ్చాడు. ఆ సమయంలో ఆ మహిళ కళ్లలో కనబడ్డ మెరుపు.. ఆయనకు ఎక్కడలేని కిక్ ఇచ్చింది. పేద ప్రజల కళ్లలో మళ్లీ మళ్లీ ఆ మెరుపు చూడాలని అనిపించింది. అందుకోసం సొంతిల్లు లేక అవస్థలు పడుతున్న వారికి వరుసగా ఇండ్లు కట్టించి ఇస్తున్నాడు. అలా ఒకదాని తర్వాత మరొకటిగా ఇప్పటికి దాదాపు 130 ఇండ్లను కట్టించి ఇచ్చాడు. ఇంకా కట్టిస్తూనే ఉన్నాడు. అతడే కేరళకు చెందిన ఫాదర్ జిజో కురియన్.
అది 2018.. ఆగస్టు నెల.. భారీ వర్షాల కారణంగా కేరళను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వినాశనం సృష్టించాయి. వరద నీటితో ఊళ్లు ఏరులయ్యాయి. వేల ఇండ్లు కూలిపోయాయి. ఇంట్లోని సామగ్రి కొట్టుకుపోయాయి. దీంతో లక్షలాది మంది మధ్య తరగతి, పేద ప్రజలు రోడ్డున పడ్డారు. ఆ సమయంలో వరద బాధితులకు సాయం అందించేందుకు ఇడుక్కి జిల్లాకు చెందిన ఫాదర్ జిజో కురియన్ తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ ఓ రేకుల షెడ్డులో వర్షంలో తడుస్తూ అవస్థ పడుతున్న ఓ మహిళను చూసి ఫాదర్ తల్లడిల్లిపోయాడు. వర్షానికి ఇంటిని కోల్పోయి చూరు కింద కూర్చున్న ఆ మహిళను చూసి చలించిపోయాడు. ఎలాగైనా ఆమెకు ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని అనుకున్నాడు.
ఆలోచన వచ్చుడు ఆలస్యమే లేదు.. ఒక లక్ష రూపాయల్లో మంచి ఇంటిని కట్టించి ఇవ్వగలమా అని పక్కనే ఉన్న తన స్నేహితుడిని అడిగాడు జిజొ కురియన్.నువ్వు చేయగలనంటే.. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు నేను సర్దుతా అని ఆ స్నేహితుడు బదులిచ్చాడు. స్నేహితుడి ఇచ్చిన భరోసాతో తక్కువ ఖర్చులో అన్ని సౌకర్యాలను కలిగిన ఇంటిని ఎలా కట్టగలమని చాలా ఆరా తీశారు. అలా క్యాబిన్ హౌస్ల గురించి తెలుసుకున్నారు. ఆ పద్ధతిలో ఆ మహిళకు చిన్న ఇంటిని కట్టించి ఇచ్చాడు. అయితే ఇంటి నిర్మాణానికి అనుకున్న దాని కంటే కాస్త రూ.50 వేలు అదనంగా అంటే.. లక్షన్నర ఖర్చయింది. అదే స్ఫూర్తితో శాంతినికేతన్ సంస్థను స్థాపించి ఈ మూడేళ్లలో దాదాపు 130 మంది పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చారు.
చర్చిలో ఫాదర్గా పనిచేసే కురియన్ వద్ద సొంతంగా ఇంతమందికి ఇల్లు కట్టించేంత డబ్బులేమీ లేవు. కానీ పేద ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పం మాత్రం ఉంది. అందుకే తనలాంటి ఆశయాలు కలిగిన కొంతమంది స్నేహితుల ద్వారా డబ్బులు సేకరించేవాడు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి సాయం చేస్తున్నాయి. మొదట ఇడుక్కి జిల్లాలో మాత్రమే ఇండ్లను కట్టించి ఇచ్చిన కురియన్.. ఇప్పుడు దాతల సాయంతో పక్క జిల్లాల్లోనూ ఇండ్లను కట్టిస్తున్నారు. అయితే ఈ ఇండ్ల కట్టించేందుకు ముందుగా కురియన్.. ప్రభుత్వ పథకాల కిందకు రాని పేదలు, దివ్యాంగులు, వృద్ధులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా అర్హులైన పేదలను గుర్తించేందుకు ఐదు బృందాల వలంటీర్లను నియమించుకున్నారు. అర్హులను వెతకడం నుంచి మొదలు అన్నింటినీ వాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. ఇలా నెలకు ఐదు నుంచి ఏడు ఇండ్లను కట్టిస్తున్నాడు కురియన్. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు పేదల కళ్లలో కనిపించే ఆ సంతోషమే మరిన్ని ఇండ్లను కట్టించేందుకు తనకు స్ఫూర్తి నిచ్చిందని చెబుతున్నాడు ఫాదర్ కురియన్.
బేస్మెంట్కి సిమెంటు దిమ్మెలు, గోడలకు పైపులు, ఫైబర్ సిమెంట్ బోర్డులు, పైకప్పు కోసం పెంకులను వాడి ఈ క్యాబిన్ హౌస్లను నిర్మిస్తారు. ఈ క్యాబిన్ హౌస్లు 300 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉంటాయి. ఈ విస్తీర్ణంలో ఒక బెడ్రూం, కిచెన్, హాల్, బాత్రూం కలిగి ఉండే క్యాబిన్ హౌస్ నిర్మాణానికి 1.5 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే రెండు బెడ్రూంలతో నిర్మించేందుకు రెండు లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఖర్చవుతుంది. జాగ్రత్తగా వాడుకుంటే సాధారణ ఇండ్లలాగే చాలాకాలం నిలిచి ఉంటాయట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం
Pet Passport : శునకాలకూ పాస్పోర్టు ఉంటుందని తెలుసా !
వందేండ్లు కాదు.. 130 ఏండ్లు బతుకొచ్చు అంటున్న శాస్త్రవేత్తలు.. అదెలా?
కూలి పనులు మాని యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నాడు..