సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత తుది జట్టు ఎంపికను డిఫెండ్ చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. బెస్ట్ కాంబినేషన్తోనే బరిలోకి దిగామని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభం కావడానికి ఒకరోజు ముందే ఇండియా టీమ్ను ప్రకటించింది. అయితే తొలి రోజు వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. వర్షం వల్ల అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాస్ వేసే ముందు వరకూ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. అయినా కూడా ముందుగా ప్రకటించిన టీమ్తోనే కోహ్లిసేన బరిలోకి దిగింది. దీనిపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కండిషన్స్లో ఇద్దరు స్పిన్నర్లను తీసుకొని కోహ్లి తప్పు చేశాడా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
చివరికి ఊహించిందే జరిగింది. నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఇండియన్ లైనప్ను రెండుసార్లు ఆలౌట్ చేయగలిగింది. అదే సమయంలో భారత బౌలర్లు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్టార్ బౌలర్ బుమ్రా అయితే దారుణంగా విఫలమయ్యాడు. అయితే తాము మాత్రం అందుబాటులో ఉన్న బెస్ట్ టీమ్తోనే బరిలోకి దిగామని కోహ్లి అన్నాడు. ఈ కాంబినేషన్తోనే వివిధ కండిషన్లలో మేము విజయం సాధించాం. ఇదే బెస్ట్ కాంబినేషన్ అని భావించాం. టెయిలెండర్ల వరకూ బ్యాటింగ్ ఉంది. అయితే గేమ్లో మరింత సమయం ఉండి ఉంటే స్పిన్నర్లు ప్రభావం చూపించేవారు అని కోహ్లి చెప్పాడు.
అయితే ఉన్న తక్కువ సమయంలోనే ఈ మ్యాచ్లో ఫలితం రాబట్టిన న్యూజిలాండ్కు విరాట్ శుభాకాంక్షలు తెలిపాడు. కేన్, టీమ్కు శుభాకాంక్షలు. వాళ్లు చాలా నిలకడగా ఆడారు. మూడు రోజుల్లోనే ఫలితం రాబట్టారు. మమ్మల్ని ఒత్తిడిలోనే ఉంచాలనుకున్న వాళ్ల ప్లాన్ను బాగా అమలు చేశారు. ఈ విజయానికి వాళ్లు అర్హులు అని కోహ్లి అన్నాడు. కనీసం 30, 40 పరుగులు తక్కువైనట్లు అతడు అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ తొలి రోజు పదే పదే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడంతో తాము వేగంగా పరుగులు చేయలేకపోయినట్లు వివరించాడు.