లండన్: ఒకే ఒక్క డిజిటల్ ఫొటో. పైన కనిపిస్తున్న ఫొటోనే అది. మీరు సింపుల్గా కాపీ చేసి మీ కంప్యూటర్ స్క్రీన్పై పెట్టుకోగలిగే ఫొటో ఇది. కానీ దీనికి వేలంలో ఏకంగా 6.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.501 కోట్లు) దక్కాయి. బీపుల్ అనే ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన ఈ డిజిటల్ ఇమేజ్ను క్రిస్టీస్ వేలం సంస్థ వేలం వేసింది. ప్రపంచంలో ఓ ప్రముఖ వేలం సంస్థ ఓ డిజిటల్ ఇమేజ్ను వేలం వేయడం ఇదే తొలిసారి. ఈ ఫొటో పేరు ఎవిరిడేస్-ద ఫస్ట్ 5000 డేస్.
ఎందుకంత స్పెషల్?
ఆర్టిస్ట్ బీపుల్ ప్రతి రోజూ ఓ కొత్త డిజిటల్ ఇమేజ్ను 2007 నుంచి క్రియేట్ చేస్తూ వచ్చాడు. డిజిటల్ ఆర్ట్కు బీపుల్ ఫేమసే. కానీ కొన్నాళ్లుగా సంచలనాలు రేపుతున్న నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) రూపంలో ఈ డిజిటల్ ఇమేజ్ను అతను క్రియేట్ చేశాడు. ఈ వేలంతో బీపుల్ అత్యంత విలువైన ఆర్టిస్ట్గా నిలిచాడని వేలం తర్వాత క్రిస్టీస్ ట్వీట్ చేసింది. ఈ ఫొటోను బిట్కాయిన్ ఉపయోగించి ప్రామాణీకరించారు. అందుకే ఇది ప్రత్యేకం. ప్రపంచంలో ఒక్క వ్యక్తి మాత్రమే ఈ ద ఫస్ట్ 5000 డేస్ కాపీని కలిగి ఉంటాడు. 2007 నుంచి ఒక్క రోజు కూడా మిస్ అవకుండా తాను ఆర్ట్ క్రియేట్ చేసినట్లు ఈ సందర్భంగా బీపుల్ చెప్పాడు. ద ఫస్ట్ 5000 డేస్ అనేది అతని అన్ని ఆర్ట్లతో కూడి ఓ కాలేజ్. వీటన్నింటినీ గత నె 16న 21,069 x 21,069 పిక్సెల్స్ సింగిల్ ఇమేజ్లోకి తీసుకొచ్చాడు.
అసలేంటీ ఎన్ఎఫ్టీ?
ఎన్ఎఫ్టీలు క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో ఓ కొత్త ట్రెండ్. ఈ మధ్యే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. నాన్ ఫంజిబుల్ టోకెన్స్లో నమోదయ్యే ఒక్కొక్క వస్తువు ప్రత్యేకమైనదే. దీనిని మరోదానితో మార్చలేము. ఎన్ఎఫ్టీలు కచ్చితంగా ఇమేజ్లే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వీడియోలు, వీడియో గేమ్లలోని ఇన్-గేమ్ ఐటెమ్స్, ట్వీట్ కూడా కావొచ్చు. వీటిని ప్రముఖ క్రిప్టోకరెన్సీ అయిన ఈథెరమ్ ఉపయోగించి అమ్ముతారు, కొంటారు. ప్రస్తుం ఒక ఈథెరమ్ విలువ రూ.1.3 లక్షలుగా ఉంది. క్రిస్టీస్ కూడా ఈ వేలం డబ్బును ఈథర్లలోనూ తీసుకుంటోంది.