ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతదో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. సోమవారం రాత్రి ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో నిర్వహించిన ధూం-ధాం కార్యక్రమానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పాడి కౌశిక్రెడ్డిలతో కలిసి ముఖ్యఅతిథిగా హరీశ్రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధూం-ధాంకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గొల్ల కురుమలు మంత్రి హరీశ్రావుకు గొర్రెను బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఎవరి బాటలో నడిస్తే మనం బాగు పడుతామో, మనకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. సీఎం కేసీఆర్కి మానవత్వం లేదని ఈటల రాజేందర్ అంటున్నడు, ఒక్కసారి ఆసరా పింఛన్ తీసుకుంటున్న తల్లిని, కళాణలక్ష్మీ చెక్కు తీసుకున్న అవ్వను, కేసీఆర్ కిట్టు తీసుకున్న తల్లిని అడుగు కేసీఆర్కు మానవత్వం ఉందో లేదో చెప్తారని ఈటలకు చురకలంటించారు.
బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలోనైనా 2వేల పింఛన్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీకు ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించూ అని ఈటల రాజేందర్కు సూచించారు. 57ఏండ్ల ఆసరా పెన్షన్లు కూడా త్వరలో అందిస్తామన్నారు. తప్పకుండా గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత సొంతింటి స్థలంలో ఇల్లు కట్టుకోడానికి 5లక్షలు ఇస్తామని హరీశ్రావు హామీ ఇచ్చారు.
గెలిపిస్తే పేదలకు 5వేల ఇండ్లు కట్టిస్తా : గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పకుండా నిరుపేదలకు సీఎం కేసీఆర్తో మాట్లాడి 5వేల ఇండ్లు కట్టిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కనగర్తి ధూం-ధాంలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 5ఏండ్లు పాలించమని ఓటేస్తే రెండున్నరేండ్లకే ఈటల రాజేందర్ రాజీనామా చేశాడని విమర్శించారు. ఓటేసే ముందు ఓటెయ్యమని వచ్చిన ఈటల రాజేందర్, రాజీనామా చేసే ముందు వచ్చి చేయాలా, వద్దా అని మిమ్మల్ని అడిగారా అన్నారు. 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పోరాడానని గుర్తు చేశారు. నా మీద 130 ఉద్యమ కేసులున్నా యని చెప్పారు. గెలిచిన తర్వాత తెచ్చి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మీ కాళ్లల్లో మెదులుతూ, మీకు సేవ చేస్తానని ఒక అవకాశం ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలపించాలని కోరారు.
గెల్లు శ్రీనివాస్ గెలిస్తే మరింత అభివృద్ధి : పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత అభివృద్ధి పనులు ఆగవద్దని సీఎం కేసీఆర్ తనను ఇక్కడికి పంపించారని, గత మూడు నెలలుగా ఇక్కడే ఉంటూ ప్రజలకు ఏం కావాలో చేస్తున్నానని తెలిపారు. గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత కూడా ఆయనతో కలిసి ఇక్కడ అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీపీ పావనీవెంకటేష్, మట్ట రజితవాసుదేవరెడ్డి, ఎంపీటీసీ దరుగుల రమా, ఉప సర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ రామిడి వీరారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మట్టా సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దరుగుల రాకేష్, ఎక్కేటి సంజీవరెడ్డి, మహేందర్, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.