తప్పు చేసి తప్పించుకోలేరు.. ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. ఈ డైలాగ్ పాతదే అయినా కాదనలేని సత్యం. ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఈ ఘటన తెలిస్తే మీరు నిజమే అని అంగీకరిస్తారు. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏండ్లకు జైలు శిక్ష విధించారు. వినడానికి కాస్త ఫన్నీగా.. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అది 1998 ఏప్రిల్ 17. ఉత్తర ప్రదేశ్ మైన్పురిలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాథమ్ జేబులో నుంచి ఎవరో డబ్బులు కొట్టేశారు. లైన్గంజ్ ప్రాంతంలో చోరీ జరిగిందని గుర్తించిన అతను.. సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్ దొంగతనం చేసినట్టు గుర్తించారు. మన్నన్ను అదుపులోకి తీసుకొని.. అతను కొట్టేసిన 45 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మైన్పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాలతో 1998 ఏప్రిల్ 18న మన్నన్ను జైలుకు పంపించారు. విచారణ ఖైదీగా 81 రోజుల పాటు జైలులో ఉన్న మన్నన్ ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. అప్పట్నుంచి ఆ కేసు అలాగే కొనసాగుతోంది. 24 ఏండ్లు అయినా దొంగతనం కేసు అలాగే నడుస్తుండటంతో ఎలాగైనా దీన్నుంచి బయటపడాలని మన్నన్ భావించాడు. గత నెల 28న కోర్టుకు హాజరై.. దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో న్యాయస్థానం అతనికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది.