వర్షాకాలం.. రోగాలకు ప్రధాన మూలం. జలుబు , దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్లు ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. అసలే ఇది కరోనా కాలం కూడా.. వీటి బారి నుంచి బయటపడాలంటే ఇమ్యూనిటీ తప్పనిసరి. ఇందుకోసం సీజనల్గా దొరికే పండ్లు తినాలంటున్నారు వైద్యనిపుణులు. ఆరుబయట వర్షం పడుతుందిగదా అని వేడివేడిగా బజ్జీలు, పకోడీలు, ఇతర ఆయిల్ ఫుడ్స్ తింటే అనారోగ్యంబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే పండ్ల గురించి వివరించారు.
దానిమ్మ..
ఎర్రగా.. నిగనిగలాడే దానిమ్మ ఇమ్యూనిటీ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు రోజూ ఒక పండు తినవచ్చు. దానిమ్మ గింజలలో విటమిన్ బీ, సీ,కే, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ బీ, సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అల్ల నేరేడు..
నల్లగా నిగనిగలాడే అల్ల నేరేడు పండ్లు ఈ వర్షాకాలం సీజన్లోనే లభిస్తాయి. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి. దీనిని అపర సంజీవనిగా పిలుస్తారు. ఈ పండులో విటమిన్ ఏ,సీ పుష్కలంగా ఉంటాయి.
యాపిల్..
రోజూ ఒక యాపిల్ తింటే వైద్యుని దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అనే విషయం తెలిసిందే. ఈ వర్షాకాలంలో రోజుకో యాపిల్ తింటే శరీరం చురుగ్గా తయారవుతుంది. జీవక్రియారేటు పెరుగుతుంది. కనుక ఈ వర్షాకాలంలో ప్రతిరోజూ ఓ యాపిల్ తప్పకుండా తినాలి అంటున్నారు నిపుణులు.
బొప్పాయి..
బొప్పాయి లేదా పొప్పెడి పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో విశేషంగా తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. ఇందులో పీచు ఎక్కువ. అయితే, బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అరటి..
జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అరటి పండును రోజూ తింటే అజీర్తి సమస్య ఉండదు.పిల్లలకు రోజూ ఓ పండు తినిపించవచ్చు. దీంతో శరీరానికి శక్తి అందడమే కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.