Eknath Shinde | శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక చేశారు. ఒకవేళ తాను మాట్లాడటం ప్రారంభిస్తే `భూకంపం` వస్తుందని శనివారం చెప్పారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలుపాలన్న ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయాన్ని ప్రశ్నించారు. దివంగత నే ఆనంద్ డిఘేకు జరిగిందేమిటో తనకు తెలుసునన్నారు. తన రాజకీయ గురువు`ధర్మవీర్` ఆనంద్ డిఘేకు జరిగిన పరిణామాలకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. 2002లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆనంద్ డిఘే మరణించారు. ఉద్ధవ్ ఠాక్రే పేరెత్తకుండానే తిరుగుబాటు ఎమ్మెల్యేలను ద్రోహులని పిలుస్తారని ఎద్దేవా చేశారు. `కేవలం సీఎం కావడానికి బాలా సాహెబ్ సిద్ధాంతాలతో మీరు రాజీ పడలేదా? బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సీఎం అవుతారు. ఇది ద్రోహం కాదా?` అని ఉద్ధవ్ ఠాక్రేను నిలదీశారు.
ఏక్నాథ్ షిండే సారధ్యంలో మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో గత నెలలో మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తరుచుగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. తిరుగుబాటుదారులు `ద్రోహులు` అని అభివర్ణించారు. మాలేగావ్లో జరిగిన సభలో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని కాపాడాలని తాను కోరుకున్నానని, అందుకే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందన్నారు.
`ఒకవేళ నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభిస్తే.. భూకంపాలు సంభవిస్తాయి. కొంత మంది వ్యక్తుల మాదిరిగా సెలవులు గడిపేందుకు విదేశాలకు వెళ్లలేదు. శివసేన, దాని అభివృద్ధే నా మనస్సులో ఉన్నాయి` అని ఏక్నాథ్ షిండే చెప్పారు. బాల్ ఠాక్రే కోడలు శ్మిత ఠాక్రే, మనుమడు నిహార్ ఠాక్రే తనకు మద్దతు పలికారని గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సారధ్యంలోని శివసేన- బీజేపీకి కలిపి 288 స్థానాలకు 200 స్థానాల్లో విజయం సాధిస్తామని షిండే వెల్లడించారు.