హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో స్తబ్ధత నెలకొన్నది. కొన్ని నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే బయోడీగ్రేడబుల్ వస్తువుల తయారీకి సిద్ధమవుతున్నాయి. అయితే కావాల్సిన అనుమతులకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువవుతున్నది. త్వరగా ఇవ్వాలని ఇండస్ట్రీ కోరుతున్నా ఫలితం లేకపోతున్నది.
హైదరాబాద్లోని కాటేదాన్, జీడిమెట్ల, చర్లపల్లిసహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 పరిశ్రమల్లో ప్లాస్టిక్ కవర్లు, సంబంధిత వస్తువులు తయారయ్యేవి. కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం వచ్చిపడింది. దీని ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31వరకు 75 మైక్రాన్లలోపు మందంగల ప్లాస్టిక్ కవర్లనే వినియోగించాలి. కానీ ప్లాస్టిక్తో తయారయ్యే ఇయర్బడ్స్, స్టిక్స్, బెలూన్స్, ఫ్లాగ్స్, క్యాండీ స్టిక్స్, ఐస్క్రీమ్ స్టిక్స్, థర్మాకోల్, ప్లేట్స్, కప్స్, గ్లాసులు, ఫోర్క్లు, స్పూన్లు, స్ట్రాలు, ట్రేలు, ఇన్విటేషన్ కార్డులు, బ్యానర్లు తదితరవాటిపై మాత్రం పూర్తిగా నిషేధం. దీంతో ఈ ప్లాస్టిక్ యూనిట్లలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
75 మైక్రాన్ల మందంగల కవర్లు తయారుచేసే వీలున్నా వాటి వినియోగం ఎంతమేరకు ఉంటుందో అర్థంకాక వేచిచూసే ధోరణిలో ఉన్నాయి పరిశ్రమ వర్గా లు. ఈ పరిస్థితికి కారణం కూడా లేకపోలేదు. మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతయ్యే అవకాశముందని, గతంలో నిషేధం విధించిన సందర్భంలోనూ ఇలాగే జరిగిందని రాష్ట్ర పరిశ్రమ గుర్తుచేస్తున్నది. ఒకవేళ బయటి నుంచి వచ్చే ప్లాస్టిక్ కవర్లను నియంత్రిస్తే.. తాము తయారు చేసే ప్లాస్టిక్ కవర్లకు గిరాకీ ఉంటుందని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవంటున్నారు.
ప్రస్తుతమున్న ప్లాస్టిక్ యూనిట్లను బయోడీగ్రేడబుల్ వస్తువుల తయారీకి వినియోగించే వీలున్నది. ఆలుగడ్డ, అరటి కాండం తదితరాలతో పదిశాతం ప్లాస్టిక్ మిశ్రమం ద్వారా బయోడీగ్రేడబుల్ వస్తువులను తయారుచేయవచ్చు. ఈ వస్తువులు తక్కువ సమయంలోనే మట్టిలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండ దు. దీంతో ఇంతకాలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తయారుచేసిన పరిశ్రమలన్నీ ఇప్పుడు బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు వచ్చేందుకు కనీసం 6 నెలలకన్నా ఎక్కువ సమయం పడుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
దేశంలో వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్మెంట్) వ్యవస్థ సరిగా లేకపోవడంవల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి నిషేధం లేదు. అయితే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా అమలవుతున్నది. అటువంటి నిర్వహణ వ్యవస్థ భారత్లోనూ అమలుచేస్తే ఇంతగా నిషేధం విధించాల్సిన ఆవశ్యకత ఉండ దు. ఏదిఏమైనా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ప్రజలకు సింగిల్ యూజ్ వస్తువులను అందుబాటులోకి తేవాల్సిన అనివార్యత ఇప్పుడు ఏర్పడింది. దీనికోసం బయోడీగ్రేడబుల్ వస్తువుల తయారీకి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ కేంద్రం త్వరగా అనుమతులివ్వాలి. అలాగే ఇతర రాష్ర్టాల నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దిగుమతి జరగకుండా గట్టి నిఘా ఉండాలి. లేనిపక్షంలో మా పెట్టుబడులు వృథా కావడమే కాకుండా ఆశించిన ప్రయోజనం నీరుగారిపోతుంది.
-రామచందర్ గౌడ్, ఆంధ్రా-తెలంగాణ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం సభ్యులు