ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వరకూ మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా పుణె జిల్లాలో (61,125), తర్వాత నాగ్పూర్ (47,707), ముంబై (32,927)లలో అధిక కేసులు ఉన్నాయి. వచ్చే 11 రోజుల్లో మరణాల సంఖ్య కూడా 64 వేలు దాటనుందని అంచనా. ప్రస్తతం ప్రతి వారం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1 శాతం మేర పెరుగుతోంది.
దీనిని బట్టే రానున్న రోజుల్లో కేసులు, మరణాల సంఖ్యను ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఆ లెక్కన వచ్చే రెండు వారాల్లో రోజుకు వెయ్యి మరణాలు సంభవిస్తాయన్న ఆ శాఖ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం మహారాష్ట్రలో 31,855 కేసులు నమోదయ్యాయి. కరోనా వచ్చినప్పటి నుంచీ మహారాష్ట్రలో ఒకే రోజు నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25.65 లక్షలుగా ఉంది. యాక్టివ్ కేసులు 2.47 లక్షలు కాగా.. మరణించిన వారి సంఖ్య 53,684గా ఉంది.