న్యూఢిల్లీ, జూలై 30: ‘న్యాయం ఆలస్యమైతే.. న్యాయం చేయనట్టే’..ఇదీ న్యాయవ్యవస్థ సూత్రం. కానీ మన దేశంలో మాత్రం ఇదేమీ పట్టదు. ఏండ్లకు ఏండ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో ఏకంగా 4 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 1.04 కోట్ల కేసులు ఏడేండ్లుగా కోర్టుల్లో మూలన పడి ఉన్నాయి. ఆరు లక్షలకు పైగా కేసులు 20 ఏండ్లుగా పెండింగ్లో ఉన్నాయి.
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 30 ఏండ్లకు పైబడి పెండింగ్లో ఉన్న కేసులు దాదాపు లక్ష కావడం గమనార్హం. గత సంవత్సరంలోనే 1.41 కోట్ల కేసులు కొత్తగా నమోదయ్యాయి. అంటే న్యాయ వ్యవస్థపై ఏ మేరకు ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివరాలు నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్లో ఉన్నాయి.
సాధారణంగా కింది స్థాయి కోర్టుల్లో 24,631 మంది (మంజూరైన) సిబ్బంది ఉండాలి. కానీ 19,288 మందితోనే కోర్టులను నడిపిస్తున్నారు. జిల్లా కోర్టులు, సబ్ ఆర్డినేట్ కోర్టుల్లో కనీసం 5,343 పోస్టులు ఖాళీ ఉన్నాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. దేశం మొత్తం వేకెన్సీల్లో 1,126 (21 శాతం) పోస్టులు భర్తీకి నోచుకోలేదు.
అక్కడ 2,508 మంది సిబ్బందితోనే కోర్టులను నడిపిస్తుండటం గమనార్హం. మంజూరైన పోస్టులు 3,634. యూపీలో ఎక్కువగా వృద్ధులు, మహిళా బాధితులే ఎక్కువగా న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దేశం మొత్తంలో మహిళలు నమోదు చేస్తున్న కేసుల్లో 22 శాతం ఉత్తరప్రదేశ్లోనే నమోదవుతుండటం అక్కడి మహిళల దుస్థితికి అద్దం పడుతున్నది.
దేశంలో మొత్తం 36.30 లక్షల కేసులను మహిళలు పెడుతుండగా, యూపీలో 7.93 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 26.55 లక్షల మంది వృద్ధులు కోర్టు మెట్లు ఎక్కుతుండగా, వాటిలో 17 శాతం కేసులు యూపీలోనే నమోదు అవుతున్నాయి. గణాంకాల ప్రకారం గత నెలలో 18.58 లక్షల కేసులు పరిష్కరించగా, అదే సమయంలో కొత్తగా 19.16 లక్షల కేసులు నమోదయ్యాయి.