జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే నివాసం ఉంటున్న మిరియాల వేణుగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. 21న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి గద్వాలలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటి పైఅంతస్తు మెట్లదారి తలుపును పగులగొట్టిన దొంగలు ఇంట్లోకి చొరబడి దాదాపు 50 తులాల బంగారు, కిలో వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
అలాగే విద్యానగర్ కాలనీలో తాలూకా క్లబ్ ప్రధాన రోడ్డు పక్కనే నివాసం ఉంటున్న సతీష్ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి కోస్గిలో ఓ ఫంక్షన్కు వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చి చూడగా ఇంట్లో దాచుకున్న 10 తులాల బంగారు ఆభరణాలు, వెండి సామాన్లు, సెల్ఫోన్, రూ.20 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు శివకుమార్ ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాన్ని పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.