హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి విడత పనులు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 96 శాతం బడుల్లో పనులకు పరిపాలన పరమైన అనుముతులు మంజూరు కాగా, 74 శాతం బడుల్లో పనులు మొదలయ్యాయి.
వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా మిగతా బడుల్లో పనులు ప్రారంభంకాలేదు. సర్కారు బడులను సమగ్రంగా మార్చేందుకు మొత్తం 12 అంశాలను తీసుకొని మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టగా, తొలుత రూ.30 లక్షల లోపు పనులను ప్రారంభించారు. చిన్న, భారీ మరమ్మతులు, విద్యుత్తు కనెక్షన్లు, తాగునీటి వసతి, మూత్రశాలల నిర్మాణాలను టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలోనే కేటాయించనుండగా, తాజాగా ఆయా పనులను చేపట్టారు. 10 విభాగాలకు చెందిన ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులన్నీ దసరా నాటికి పూర్తవుతాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ఈ కార్యక్రమం కోసం కొన్నింటిని రాష్ట్రస్థాయిలోనే బల్క్గా సేకరించేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే పెయింట్స్ టెండర్లు ఖరారు కాగా, డ్యూయల్ డెస్క్ బల్లలు, ఫర్నిచర్, గ్రీన్చాక్పీస్ బోర్డుల సేకరణ ప్రక్రియ టెండర్ల దశలో ఉన్నది. టెండర్లు పూర్తయ్యిన 30 రోజుల్లోనే 35 శాతం వస్తుసామగ్రిని బడులకు చేర్చాలని గడువుగా విధించారు.
ఈ కార్యక్రమంలో చేపట్టిన నాలుగు పైలట్ బడులు సిద్ధమయ్యాయి. పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్ జిల్లాలోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాల, అలియా మోడల్ స్కూల్, రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి జడ్పీహెచ్ఎస్, జిల్లెలగూడ జడ్పీహెచ్ఎస్ను ఎంపిక చేసి సమగ్రంగా అభివృద్ధిచేశారు. బడులు పూర్తిస్థాయిలో సిద్ధంకాగా, విద్యార్థులు ఆయా పాఠశాలల్లో తరగతులకు హాజరవుతున్నారు.