హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వాగులో గల్లంతైన ఇద్దరిలో యువతి సింధూజ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన బాలిక హిమబిందు కోసం మంగళవారం ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు చేపట్టాయి. వాగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర దాదాపు పది గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. రాత్రి కావడంతో గాలింపును ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిలిపివేశాయి. బుధవారం ఉదయం మరోసారి గాలింపు చేపట్టనున్నారు.
దైవ దర్శనం చేసుకొని వస్తుండగా..
దోసల వాగులో గల్లంతైన యువతి సింధూజ స్వస్థలం జనగామ జిల్లా దేవరప్పుల మండల పరిధిలోని చిన్నమడూరు. ఎంపీటీసీ సభ్యురాలు గొడుగు సుజాత, మల్లికార్జున్ దంపతులకు కూతురు. వీరికి కొడుకు నవీన్ ఉన్నాడు. ఇటీవల నవీన్కు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో.. ఇక కూతురు సింధూజకు వివాహం చేద్దామని సంబంధాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఊరైన యాదగిరిగుట్టకు చేరుకొని, స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం రాజపేట మండలం బొందుగులలో మల్లికార్జున్ తోడల్లుడు ఆంజనేయులు చేపల పెంపకం యూనిట్ ప్రారంభోత్సవానికి పిలువగా కారులో కుటుంబసభ్యులు వెళ్లారు. మల్లికార్జున్ సమీప బంధువు శ్రవణ్.. సింధూజ, హిమబిందులను మోటార్ సైకిల్పై తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పారుపెల్లివాగు ఉధృతి పెరగడంతో కుర్రారం మీదుగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుడ్యామ్పై జారిపడి దోసల వాగులో కొట్టుకుపోయారు. ఈ సంఘటనలో సింధూజ మృతదేహం లభ్యమైంది. సింధూ మృతితో కుటుంబంలో విషాదం అలుముకున్నది.