హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గత ఐదేండ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తెలిపారు. ఈ మూడు రంగాల్లో గత ఐదేండ్లలో రూ.1.81 లక్షల కోట్ల సంపదను సృష్టించడం దేశంలోనే గొప్ప రికార్డు అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి, అంకితభావం, పరిపాలనా దక్షతకు ఆర్బీఐ నివేదికే నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన కీర్తి, ప్రగతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అభివృద్ధి లేదని విమర్శిస్తున్న వారికి ఆర్బీఐ నివేదికే సమాధానమని స్పష్టంచేశారు. ఉద్యమ కాలంలో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. వ్యవసాయ, అటవీ, మత్స్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, లక్షల కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అనేక పనులు చేపట్టారని వివరించారు. ఈ మూడు రంగాల్లో 2017-18లో రూ.95,098 కోట్లుగా ఉన్న సంపద 2021-22 నాటికి రూ.1,81,702 కోట్లకు పెం చడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ఐదేండ్లలో రూ. 86,604 కోట్ల సంపద పెరుగుదల మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మే సీఎం కేసీఆర్.. వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని వినోద్కుమార్ తెలిపారు. రైతుబంధు ద్వారానే రైతులకు రూ.58 వేల కోట్లు అందించారని గుర్తుచేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చుచేసి 425 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేశామని, ఆరేండ్లలో రూ.26 వేల కోట్ల సంపదను సృష్టించగలిగామని వివరించారు. హరితహారం తదితర కార్యక్రమాలతో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు.
సంవత్సరం సంపద
2017-18 95,098
2021-22 1,81,702
ఐదేండ్లలో పెరుగుదల 86,604
ఆరేండ్లలో మత్స్య సంపద 26,000