‘రిపబ్లిక్’ సినిమా మా అందరికి గౌరవాన్ని తీసుకొచ్చింది. చిరంజీవి కెరీర్లో ‘రుద్రవీణ’ మాదిరిగా ఈ సినిమా చిరకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుందనే నమ్మకముంది’ అని అన్నారు దేవా కట్టా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రిపబ్లిక్’. సాయితేజ్ హీరోగా నటించారు. అక్టోబర్నెలలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. తాజాగా ఈ నెల 26న జీ5 ఓటీటీలో విడుదలకాబోతున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జగపతిబాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నా. ఇందులో చూపించిన నిజాల్ని ప్రేక్షకులు స్వీకరిస్తారా?సందేశాన్ని ఆదరిస్తారా?అనుకున్నా. కానీ నేను ఊహించిన దానికంటే థియేటర్స్లో మంచి స్పందన వచ్చింది’ అని తెలిపారు. ‘సామాన్యుల గొంతులకు రూపాన్ని ఇస్తూ చేసిన సినిమా ఇది. రాజకీయాల గురించి ఇదివరకు తెలుగు తెరపై ఎవరూ చర్చించని అంశాలతో సినిమాను చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఆ ప్రయత్నంలో విజయవంతమవ్వడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ కామెంటరీతో ఈ సినిమా విడుదవుతోంది. ఈ సినిమా ప్రయాణంలో ప్రతిషాట్, సీన్ వెనుక ఉన్న కష్టాలను, ఎదురైన సవాళ్లను నా మాటల ద్వారా అందరూ వినొచ్చు’ అని దేవాకట్టా తెలిపారు.