అమరావతి : ఏపీ పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు గతంలోనే గుర్తు చేసిందని పేర్కొన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటున్న ప్రభుత్వానికి ప్రస్తుతం పరిస్థితి అర్థంకావడం లేదని అన్నారు. ఉద్యోగులతో చర్చించేందుకు అవసరమైతే నాలుగు మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తుందని అన్నారు. భవిష్యత్తు లోనూ ఉద్యోగులకు మంచి చేస్తుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా మెరుగైన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల నష్టం జరుగుతుందని భావిస్తే ప్రభుత్వంతో మరోసారి చర్యలు జరిపి పరిష్కరించుకోవచ్చుకదాని సూచించారు.
గత మూడు రోజులుగా చర్చలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల రాక కోసం ఎదురుచూసామని అయినా ఉద్యోగులు రాలేదని అన్నారు. రేపు కూడా వారి కోసం ఎదురుచూపు చూస్తామని సజ్జల వెల్లడించారు. ఇప్పటికైన చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితి నాయకులకు ఆయన సూచించారు.