నల్లగొండ : స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తుందన్నారు.
మంగళవారం నల్లగొండ మున్సిపాలిటీ ప్రత్యేక పాలక మండలి సమావేశంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాంధీజీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టారన్నారు. గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని వర్తమాననికి అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు.
ఈ నెల 8 నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తుందన్నారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి దేశభక్తి ని చాటుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.
అనంతరం ఇంటింటికీ తిరుగుతూ జాతీయ పతాకాలను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వెంట స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణా చారి తదితరులు పాల్గొన్నారు.