రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లుని పేరు మీద భూమి పట్టా చేశాడనే కక్షతో ఓ కొడుకు తన తండ్రి రెండు కాళ్లను నరికిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పిల్లిపల్లి గ్రామానికి చెందిన మోగులమొని వెంకటయ్య అనే రైతుకు తాటిపర్తి రెవెన్యూ పరిధిలో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో పెద్ద కొడుకు పర్వతాలుకు 1.30 గుంటలు, రెండో కొడుకు శ్రీనివాస్కు 1.30 గుంటలు, చిన్న కొడుకు పేరిట 1.30 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు. తన కూతురు భర్త పేరు మీద మరో 1.30 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు.
కొడుకులం ఉండగా కూతురు పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ చేస్తావని తండ్రి వెంకటయ్యతో పర్వతాలు గొడవ పడ్డాడు. కోపోద్రిక్తుడైన పర్వతాలు గొడ్డలితో తండ్రి రెండు కాళ్లు నరికేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని కామినేని దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.