విశాఖపట్నం: విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలి పాలెంలో 30 సెంట్ల స్థలం పంచలేదనే అక్కసుతో కన్న తండ్రినే చంపిన ఘటన వెలుగు చూసింది. చేనులో తండ్రి పీక కోసి.. తల్లిని బురదలో తొక్కి కొడుకు, కోడలు పరారయ్యారు. ఈ ఉదంతం తెలియడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పలువురు గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టెక్కలి పాలెం గ్రామానికి చెందిన గొంప స్వామి నాయుడు (84) కు అప్పారావు, సత్యనారాయణ అనే ఇద్దరు కొడుకులున్నారు.
పెద్ద కొడుకు అప్పారావు రైల్వే కలాసీగా పని చేస్తున్నాడు. చిన్న కొడుకు సత్యనారాయణ ఆర్టీసీలో పని చేస్తున్నాడు. కొడుకులకు ఆస్తిని పంచాడు. కాగా స్వామి నాయుడు నరసమ్మ దంపతుల పేరున 30 సెంట్ల స్థలం ఉంది. పెద్ద కొడుకు, కోడలు చూడటం లేదని చిన్న కుమారుడు దగ్గరే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 30 సెంట్ల స్థలంపై పెద్ద కొడుకు అప్పారావు అతని భార్య పార్వతికి కన్నుపడింది.
ఆ భూమిని తమ పేరున రాయమంటూ తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. కానీ స్వామి నాయుడు తన పేరును పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మార్వో చుట్టూ తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు పథకం ప్రకారం తన తండ్రిని చంపాలని ప్లాన్ వేశాడు. ఆ భూమిలో పెద్ద కొడుకు నాటు వేసినట్లు తెలుసుకున్న స్వామి నాయుడు దంపతులు బుధవారం ఉదయాన్నే పొలంలోకి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో పెద్ద కొడుకు అప్పారావు, అతని భార్య పార్వతి, అతని కొడుకులు శంకర్ రావు, నర్సింగ్ రావు కలిసి దాడి చేసినట్లు చెప్పారు.
స్వామి నాయుడుని అతని పెద్ద కొడుకు అప్పారావు పదునైన కత్తితో గొంతుకోసి హత మార్చగా, తల్లిని అందరూ కలిసి బురదలో తొక్కేశారని తెలిపారు. నిందితులు పారిపోతున్న సమయంలో మృతుడి చిన్న కుమారుడి కొడుకు 14 ఏండ్ల బాలుడు నాన్నమ్మ తాతయ్యలు తిరిగి రాలేదని చూసేందుకు వెళ్తూ ఎదురుపడ్డాడు. అది చూసిన నలుగురు నిందితులు తనను కూడా చంపేందుకు వెంట పడ్డారని, ప్రాణ భయంతో ఊర్లోకి పరుగున వెళ్లి విషయం చెప్పానని ఆ బాలుడు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు గొంప అప్పారావు, అతడి భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్సై ఎల్ నరేశ్ తెలిపారు.