బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. దీన్నే మొదటి స్వాతంత్య్ర సంగ్రామంగా పిలుస్తాం.ఈ సిపాయిల తిరుగుబాటు ప్రకంపనలు హైదరాబాద్నూ తాకాయి. తిరుగుబాటును రెచ్చగొడుతూ లేఖల పరంపర ఓవైపు,
రకరకాల వదంతులు మరోవైపు హైదరాబాద్ను చుట్టుముడుతున్నాయి.
ఉత్తర భారతంలో జరిగిన తిరుగుబాటు వార్త హైదరాబాద్కు ఆగమేఘాల మీద చేరుకుంది. బ్రిటిష్ దళాలు మొదటి దశలో ఎదుర్కొన్న ఓటమి వార్తలు బ్రిటిష్ వ్యతిరేక భావనలు ప్రగాఢంగానే ఉన్న హైదరాబాద్ సంస్థానంలో సంచలనం సృష్టించాయి. మసీదుల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు జరిగాయి. బ్రిటిషర్లపై యుద్ధానికి పిలుపునిస్తూ పోస్టర్లు వెలిశాయి. రకరకాల వదంతులు రాజ్యమేలుతుండడంతో తెల్లవాళ్లు ప్రాణాలు బిగబట్టుకుని గడుపుతుండేవారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటి సైనిక తిరుగుబాటు ఔరంగాబాద్లో 1857 జూన్లో జరిగింది. ఉత్తరాదిలో సైనిక తిరుగుబాటును అణచేందుకు తమను పంపరాదంటూ ఔరంగాబాద్ కంటింజెంట్ సైనికులు తిరుగుబాటు చేశారు. ‘నిజామ్ కే సర్హద్ కే బాహర్ న జాయెంగే… దీన్ కే ఊపర్ కమర్ నహీ బాంధేంగే’ (నిజాం సరిహద్దులు దాటం… సాటి మతస్థులపై యుద్ధం చేయం) అనే నినాదంతో ఈ తిరుగుబాటు జరిగింది. కానీ బ్రిటిష్ సైనికాధికారులు ఈ తిరుగుబాటును వెంటనే అణచివేశారు. తిరుగుబాటుకు జమేదార్ ఆమిర్ ఖాన్, డఫేదార్ మీర్ ఫిదాఅలీ నాయకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ తప్పించుకున్నాడు. మీర్ ఫిదాఅలీని పట్టుకుని ఉరితీశారు.
ఈ తిరుగుబాటు ప్రభావం బుల్ఢానాలోని కంటింజెంట్ దళాలపై కూడా పడింది. బుల్ఢానా సైనికులు కూడా ఉత్తరాది తిరుగుబాటు అణచివేతకు వెళ్లబోమని తిరగబడ్డారు. సహాయం దొరుకుతుందన్న ఆశతో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జమేదార్ చీడాఖాన్ తిరుగుబాటు చేసి శిబిరాన్ని వదిలిపెట్టిన కొందరు సైనికులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరాడు. కానీ అది అత్యాశే అయింది. చీడాఖాన్ను పట్టిచ్చిన వారికి రూ. 3 వేల బహుమానం ప్రకటించారు. ఔరంగాబాద్, బుల్ఢానా అల్లర్లలో చనిపోయినవారు కాకుండా మరో పాతిక మందికి బ్రిటిష్వారు మరణశిక్షలు అమలు చేశారు. అనేక మందికి కొరఢా దెబ్బల శిక్ష విధించి సైన్యం నుంచి డిస్మిస్ చేశారు. దీనిని బట్టి ఈ తిరుగుబాటును బ్రిటిష్వారు ఎంత తీవ్రంగా పరిగణించారో అర్థం చేసుకోవచ్చు.