నిర్మల్ : తెలంగాణలో పంట పెట్టుబడి సాయం అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతుబంధు సంబురాల్లో భాగంగా బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలో రైతులు, ప్రజాప్రతినిదులతో కలిసి మంత్రి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేక్ కట్ చేసి అన్నదాతలకు తినిపించారు.
విద్యార్థినిలు, మహిళలు ‘రైతుబంధు వొచ్చే సంబురాలు తెచ్చే, తెలంగాణ రైతు బంధు, జై కేసీఆర్’ అంటూ వేసిన ముగ్గులను చూసి మంత్రి ముగ్ధులయ్యరు. ముగ్గులు వేసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుబంధు పంట పెట్టుబడి నిధులు తమ ఖాతాల్లో పడడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారాన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతులకు పెద్దమొత్తంలో పెట్టుబడి సాయం ఇచ్చిన దాఖలాలు లేవని, రైతు బంధు దేశానికే స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు.
రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి, మండల ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.