మెదక్ : స్వాతంత్రోద్యమంలో కవులు, కళాకారులు, పాత్రికేయుల పాత్ర అమోఘమని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ అన్నారు.
ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా కేంద్రం దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.
స్వాతంత్య్ర పోరాటంలో కవులు, సాహితివేత్తలు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమ రచనలతో కృషిచేశారని అన్నారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని సూచించారు.
అనంతరం శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
25 మంది కవులు దేశభక్తి కవితలను వినిపించారు. వీరిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ ఎస్ హరీశ్, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సత్కరించారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ తరుణ్, డీఈఓ రమేష్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి పరశురాంనాయక్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షురాలు కవిత, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి