అమరావతి : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్, రెవెన్యూ, వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్లు , భూగర్భగనులు, అటవీ, రవాణా తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ పథకం కింద, టిడ్కోకు సంబంధించిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా, రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఏపీలో అక్టోబరు 2 నుంచి తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మైనర్ మినరల్కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీల కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన,అటవీ పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.