గతంలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో రైల్వేశాఖకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేది. కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. రైల్వే బడ్జెట్ను జనరల్ బడ్జెట్తో కలిపి ప్రవేశపెడుతున్నది. దీనివల్ల రైల్వేశాఖకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. మోదీ ప్రధాని అయ్యాక పలు రాష్ర్టాలకు, ముఖ్యంగా తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు లెవ్వు, కొత్త రైళ్లు లెవ్వు. ఉన్నా.. అవి ఆగవు.
రైల్వే రవాణా వ్యవస్థ దేశానికి వెన్నెముక. యూపీఏ హయాంలో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో పటిష్ఠమైన రైల్వే రవాణా వ్యవస్థ మంచి ఫలితాలను సాధించింది. ప్యాసింజర్ రైళ్లు చాలావరకు సమయపాలన పాటించేవి. ప్రయాణ టికెట్ల బుకింగ్లో అక్రమాలకు తావు లేకుండా సవ్యంగా సాగేవి. జనరల్ టికెట్ల జారీ కూడా అత్యాధునిక యంత్రాల సాయంతో ఆఫ్లైన్లో సాగేది. ఫలితంగా టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తక్కువగా ఉండేది.
కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ మూలంగా చాలా రైళ్లను రద్దుచేసింది. లాక్డౌన్ ముగియడమే కాదు, కరోనానే
కనుమరుగైంది. కానీ, కేంద్రం రైళ్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఇది అత్యంత ఖండనీయం. పునరుద్ధరించిన కొన్ని ప్యాసింజర్ రైళ్ళను కూడా ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చి వాటి గమ్య స్థానాలను, రైలు ఆగే స్టేషన్లను (హాల్ట్) కుదించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉదాహరణకు ‘కాజీపేట-బల్లార్షా’ లైన్లో చాలావరకు మూడో మార్గం కూడా పూర్తయింది. అయినా కొన్ని స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లు ఆగడం లేదు. ఆయా ప్రాంతా ల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ప్రైవే ట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సికింద్రాబాద్-మణుగూరు మధ్య నడిచే కాకతీయ ఎక్స్ప్రెస్ రైలును కొత్తగూడెం వరకే నడుపుతున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నడిచిన ప్యాసింజర్ రైళ్లన్నీ పునరుద్ధరించి అన్ని స్టేషన్లలో రైళ్లను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే అవసరమైన మార్గంలో కొత్త రైళ్లను నడుపాలని కోరుతున్నారు.
అసలే ఉత్తర తెలంగాణలో రైలు మార్గం చాలా తక్కువ. ఈ ప్రాంతం పరిశ్రమలతో, మహారాష్ట్రతో సంబంధాలు కలిగి ఉన్నది. నిజామాబాద్- ముడ్కేడ- ఆదిలాబాద్- పింపుల్కొట్టి- బల్లార్షా- సిర్పూర్ కాగజ్నగర్- మంచిర్యాల- రామగుండం- పెద్దపల్లి- కొలనూరు- జమ్మికుంట- కాజీపేట- హైదరాబాద్ మార్గంలో ఒక రైలు నడిపితే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజామాబాద్- కామారెడ్డి- మేడ్చల్- సికింద్రాబాద్- కాజీపేట- జమ్మికుంట- కొలనూరు- పెద్దపల్లి- రామగుండం- మంచిర్యాల-సిర్పూర్ కాగజ్నగర్- బల్లార్షా- సింపల్ కుట్టి- ఆదిలాబాద్- ముడ్కేడ- నిజామాబాద్ మార్గంలో ప్యాసింజర్ రైళ్ళు ప్రవేశపెట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్- పెద్దపల్లి- జమ్మికుంట- కాజీపేట- హైదరాబాద్ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టి ఉత్తర తెలంగాణకు రైలు రాకపోకలను మెరుగుపర్చాలి. వీటితో పాటు తెలంగాణ మొత్తంగా అవసరమైన మార్గాల్లో ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టు తగినరీతిలో రైళ్లను ప్రవేశపెట్టాలి. మెరుగైన రైల్వే వ్యవస్థ వల్ల రైల్వే శాఖకు ఆదాయం పెరుగుతుంది. ప్రయాణీకులు, పరిశ్రమల అవసరాలు తీరుతాయి.
దండంరాజు రాంచందర్రావు: 98495 92958
(వ్యాసకర్త: రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్)