1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించాడు. ముస్లిం సోదరులు దేవరకొండ వాసులైన అజ్మద్ అలీ, సయ్యద్ అలీలు.. ‘జాన్నబి’, ‘సుశీల’, ‘సుజాత’, ‘అంపరాకాసి’, ‘మినీ’, ‘ప్రమీల’, ‘దిగంబర మోహిని’, ‘శాంతశీల’, ‘హరిప్రియ’ అనే నవలలను తెలుగులో రచించారు. ఈ నవలలు 1930-60ల మధ్య ప్రచురింపబడినాయి. 1935లో వి.ఆర్.అవధాని ‘పతీ పత్ని’ అనే నవలను ప్రచురించాడు.
బ్రిటిష్ పాలనలో 1942లో బెంగాల్లో కరువు సృష్టించిన విలయతాండవాన్ని చిత్రిస్తూ భవానీ భట్టాచార్య గారి నవలను మానెపల్లి తాతాచార్య తెలుగులోకి అనువదించిన నవల ‘ఆకలి’. అది 1942లో గోలకొండ పత్రికలో అచ్చయింది.
అభ్యుదయ యుగంలో వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’, ‘గంగు’ నవలలు రచించాడు. ‘గంగు’ అసంపూర్ణ నవల. 1950 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి ‘ఆయువుపట్టు’ అనే నవలను రచించాడు. 1940-50 దశకంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని గూర్చి ఆంధ్ర ప్రాంత రచయితలు పత్రికల్లో వార్తలు చదివి, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఆ విషయాలు విని నవలలు రచించారు. 1947లోనే బొల్లిముంత శివరామకృష్ణ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ ‘మృత్యుంజయులు’; లక్ష్మీకాంత మోహన్ ‘సింహగర్జన’ రచించారు. 1950ల్లో మహీధర రామమోహన్రావు ‘ఓనమాలు’, ‘మృత్యువు నీడలు’ వంటి నవలలు రచించారు. 1970వ దశకంలో తిరునగరి ‘సంగం’; దాశరథి రంగాచార్యులు ‘చిల్లరదేవుళ్లు’, ‘మోదుగు పూలు’, ‘జనపదం’ మొదలైన నవలల్లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రించారు.
నిజామాబాద్కు చెందిన లోకమలహరి 1947-55 మధ్య కాలంలో ‘జగ్గని ఇద్దె’, ‘సంగెం’ అనే రెండు నవలలు రాశాడు. 1955లో దేవదాస్రెడ్డి ‘ఎల్లాగౌడు’ అనే నవలను ప్రచురించాడు. ‘జగ్గని ఇద్దె’ నవలలో జగ్గడు కింది (మాల కులం) వర్గంలో పుట్టినవాడు అయి ఉండి కూడా చదువుకొని ‘జగదీశ్’గా మారి అంబేద్కర్ ఆలోచనతో గాంధేయ దృక్పథంతో అభ్యుదయ మార్గంలో పయనించే ఇతివృత్తం ఉన్నది. ఖమ్మం జిల్లావాడైన కవిరాజమూర్తి ఉర్దూలో ‘మై గరీబ్ హూ’ అనే నవలను రచించాడు. ఇదే నవల 1954లో ‘చివరి రాత్రి’ పేరుతో అనువాదమైంది. పుల్లాబొట్ల వేంకటేశ్వర్లు ‘సముద్ర ఘోష’, ‘రాధ’ అనే నవలలు రాశాడు. హీరాలాల్ మోరియా 1958లో
‘గుడిమెట్లు’, ‘జీవనది’, ‘ఎవరికోసం’ వంటి నవలలు రచించాడు.
భాస్కరభట్ల కృష్ణారావు (1918-66) కథలే కాకుండా నవలలు కూడా రాశాడు. 1957లో ‘యుగసంధి’, ‘వెల్లువలో పూచికపుల్లలు’ అనే నవలలను రచించాడు. వీటిలో ‘రొమాంటిసిజం’ తోపాటు తెలంగాణ ఉద్యమాలను గూర్చిన ఇతివృత్తం ఉన్నది. హైదరాబాద్లోని మధ్యతరగతి కుటుంబ జీవితాలు ఈ నవలల్లో ప్రతిబింబించాయి.
తెలంగాణలో ఒక ముస్లిం పెట్టిన ‘మీజాను’ పత్రిక తెలుగు, ఉర్దూ భాషల్లో వచ్చేది. తెలుగు ‘మీజాను’ పత్రికకు ఆంధ్ర ప్రాంతం వాడైన అడవి బాపిరాజు సంపాదకుడిగా నియమింపబడినాడు. బాపిరాజు ధైర్యంతో నాటి పోరాట వార్తలను ప్రచురించేవాడు. వామపక్ష భావాల వైపు మొగ్గుచూపుతూ పత్రికను నడిపేవాడు. ఆవుల పిచ్చయ్య వంటి పోరాటకారులు కూడా ఆ పత్రికలో పనిచేశారు. అడవి బాపిరాజు గొప్ప నవలాకారుడు. ఆయన రచించిన ‘హిమబిందు’, ‘అడవి శాంతశ్రీ’, ‘గోన గన్నారెడి’, ‘నారాయణరావు’, ‘కోనంగి’, ‘తుఫాను’ మొదలైన నవలలు ‘మీజాను’ పత్రికలో అచ్చయ్యాయి. ‘నారాయణరావు’ అనే నవలను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆనాటి
అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితంగా ఇచ్చాడు. జానకి రామారావు నల్లగొండ జిల్లాలోని అక్కినేపల్లి గ్రామ భూస్వామి. బాపిరాజు ప్రచురించిన చారిత్రక నవలలు తెలంగాణ చారిత్రకాంశాలతో కూడినవే చాలా ఉన్నాయి.
1961లో సింగరాజు లింగమూర్తి ‘ఆదర్శాలు- ఆంతర్యాలు’ , ‘ఆకర్షణలో అపసరాలు’; గూడూరి సీతారాం ‘కొత్త పాతలు’ రాశారు. 1958లో శొంఠి కృష్ణమూర్తి ‘మూగ భార్య’ నవలను రచించాడు.
– ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606