హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చి, దుర్మార్గంగా వ్యవహరించిన ప్రధాని మోదీ సహించరాని తప్పు చేశారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఏర్పడిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థలను హేళన చేయడం వెనుక ఎలాంటి కుట్ర దాగి ఉన్నదో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సమయంలో సొంత బీజేపీ ఎంపీ ఆనంద్మోహన్ పార్లమెంటులో చేసిన గలాటా కారణంగా ఆయన చెయ్యికి గాయమైన విషయాన్ని గుర్తుచేశారు.
మోదీ కుట్రలను తిప్పికొట్టాలి: నామా
పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ ఎనిమిది సార్లు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారని, ఆయన వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ ఉనికినే ప్రశ్నార్థకం చేసేందుకు మోదీ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను మొత్తం సమాజం ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో గుజరాత్ను మించిపోవడాన్ని జీర్ణించుకోలేక మోదీ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో తెలంగాణ భాగం కాదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, లోక్సభ సభ్యులు పోతుగంటి రాములు, గడ్డం రంజింత్రెడ్డి, బీబీ పాటిల్, మాలోతు కవిత, వెంకటేశ్ నేతకాని, మన్నె శ్రీనివాస్రెడ్డి, పసునూరి దయాకర్ పాల్గొన్నారు.