ముంబై, జూన్ 24: ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) ధరలు త్వరలో పెరగనున్నాయి. ఏసీల నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే స్టార్ రేటింగ్స్పై కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో వీటి ధరలు 7 నుంచి 10 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది. దేశంలో ఏసీల ఇంధన వినియోగ ప్రమాణాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీసియెన్సీ (బీఈఈ) ఏప్రిల్ 19 జారీచేసిన నోటిఫికేషన్ మేరకు వచ్చే నెల నుంచి కొత్త రేటింగ్స్ వర్తిస్తాయి.
స్టార్ రేటింగ్ అనేది ఏసీ ఇంధన వినియోగ సామర్థ్యానికి సూచిక. బీఈఈ ఇచ్చే ఈ రేటింగ్ ద్వారా కొనుగోలుదార్లు ఆయా ఏసీ పనిచేయడానికి ఎంత విద్యుత్ అవసరమవుతుందో తెలుసుకోగలుగుతారు. రేటింగ్లో స్టార్స్ పెరిగే కొద్దీ, అధిక ఇంధన ఆదా జరిగి, విద్యుత్ బిల్లు తక్కువ వస్తుంది. తాజాగా అమలులోకి రానున్న కొత్త స్టార్ రేటింగ్స్తో ప్రస్తుతం ఉన్న ఏసీల ఎనర్జీ రేటింగ్స్ ఒక్క స్టార్ తక్కువవుతుంది. అంటే ఈ వేసవిలో 5 స్టార్ ఏసీని కొనిఉంటే..అది వచ్చే నెలలో 4 స్టార్ అవుతుంది.
కొత్త రేటింగ్ నిబంధనల ప్రకారం ఏసీ ఉత్పత్తిదారులు వాటి డిజైన్లో మార్పు చేస్తారు. వాటి ఎయిర్ఫ్లో, కాపర్ ట్యూబ్స్ సర్ఫేస్ ఏరియాను పెంచడం, కంప్రషర్ సమర్థతను మెరుగుపర్చడం వంటి మార్పులు జరుగుతాయి. దీంతో వీటి ఉత్పాదక వ్యయం పెరగనున్నందున, ఏసీల ధరలు సైతం పెరుగుతాయి. కొత్త నిబంధనలతో ఒక్కో యూనిట్ ఉత్పాదక వ్యయం రూ. 2,000 నుంచి రూ.2,500 వరకూ పెరుగుతుందని లాయడ్స్ సేల్స్ హెడ్ రాజేష్ రాఠి చెప్పారు.