తిరుమల : కరోనా మహమ్మారి తగ్గిపోవడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఆగస్టు నెలలో 22.22 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 140.34 కోట్లు వచ్చిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తులకు లడ్డూల విక్రయం ద్వారా రూ. కోటి 5లక్షల ఆదాయం వచ్చిందని, 47.76 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద చేశామని పేర్కొన్నారు.
10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. ఈనెల 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ నెల 27న సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, రాత్రి 9 గంటలకు పెదశేషవాహన సేవలో పాల్గొంటారని వెల్లడించారు. 28న పరకామణి మండపాన్ని ప్రారంభిస్తారని వివరించారు.