భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జెండాలు ఏలిన దేశం బాగుపడలేదు. పేరుకు గొప్ప దేశం జీవన ప్రమాణంలో మాత్రం పేద దేశంగానే ఉంది. దేశ ప్రజల సామూహిక లక్ష్యం వైపు అడుగులు పడలేదు. కులం, మతం, విద్వేషం, వివక్షత తప్ప దేశం సాధించింది ఏమిటి అనేది ప్రశ్నించు కోవాల్సిన అవసరం ఉంది. దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకును చీకట్లోకి నెట్టేసిన పాపం ఇన్నేండ్లు పరిపాలించిన, పరిపాలిస్తున్న నేతలది.వారి నుంచి విముక్తి కోసం 75 యేండ్ల దేశ చరిత్రలోనే ఒక నూతన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించబోతుంది. నేడు మన దేశం కోసం కేసీఆర్ రథయాత్ర బయలు దేరనుంది.
భారత ప్రజల చైతన్య శక్తిగా కేసీఆర్ ఉద్యమ అడుగులు పడుతున్నాయి. మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థి యువత, ఉద్యోగ, ప్రజా, కుల సంఘాల నాయకులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎలా పాలు పంచుకున్నమో నేడు దేశం కోసం కేసీఆర్ వెన్నంటే ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అన్ని రాష్ర్టాల బీజేపేతర పార్టీల ముఖ్యమంత్రులు, నేతలు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఆయా విభాగాల నిపుణులు, విద్యావంతులు, జర్నలిస్టులతో పెద్ద ఎత్తున చర్చలు, సమాలోచనలు జరిపారు. ఈ నెల లేదా నవంబర్ నెలలో హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
14 ఏండ్లు పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. మనమే పరిపాలిస్తున్నము. 8ఏండ్లలో భారత దేశానికి మార్గదర్శకంగా మన తెలంగాణ నిలిచిందంటే దీని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్త్తూ ఈ దేశానికి దశ దిశను చూపించే స్థాయికి ఎదిగాం. దేశంలో మనం ఒక భాగమే. మనం మంచిగా ఉన్నాము. సంతోషంగా ఉన్నాము. దేశ ప్రజలు కూడా సంతోషంగా మంచిగా బతకాలంటే మనమే ముందుకు పోవాలి. తెలంగాణ ప్రజల దీవెనలతో.. దేశం కోసం ఎంతకైనా కొట్లడాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే దేశ ప్రజల సామూహిక లక్ష్యం కోసం సరికొత్త అజెండాతో త్వరలోనే జాతీయ రాజకీయాల్లో తెలంగాణ శక్తి ప్రధాన పాత్ర పోషించనున్నది. ప్రజల సామూహిక లక్ష్యం కోసం సరికొత్త అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ సంచలన ప్రకటన కోసం దేశమంతా ఎదురుచూస్తుంది.
తెలంగాణలో దళిత బంధు దళిత కుటుంబాల్లో వెలుగు పంచుతుంది. అట్లే రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలు దేశానికి ఇప్పటికే ఆదర్శంగా నిలిచాయి. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే దేశంలోని మొత్తం రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ఇందూర్ సభ నుండి సీఎం కేసీఆర్ ప్రకటించడం దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. దేశంలోని అన్ని జాతీయ ఇంగ్లీష్, హిందీ పత్రికలు, టీవీలు ప్రముఖంగా ప్రచురించాయి. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు, పశ్చిమ మహారాష్ట్ర నుంచి కలకత్తా వరకు నేడు దేశమంతా కేసీఆర్ చర్చ అయిండు. కేసీఆర్ గొప్ప ఆధ్యాత్మిక, దైవభక్తి గల నాయకుడు.తన దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. విభిన్న సంస్కృతులు కలిసిపోయిన ప్రేమానురాగాలు పంచుకునే గొప్ప మట్టి పరిమళం మనదేశం. శాంతి, సహనం, సామరస్యానికి ప్రతీక ఈ దేశం. అందరికీ ప్రేమను పంచడంలో తనకు తానే సాటి కేసీఆర్ అందుకే సర్వ జనహిత పిత మన కేసీఆర్ భారత సర్వ హిత గొంతుక.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న, దేశ ప్రజల జీవన ప్రమాణాలు ధ్వంసం చేస్తున్న, రాష్ర్టాల సమాఖ్యను దెబ్బతీస్తున్న, దేశానికి మతమనే క్యాన్సర్ అంటిస్తున్న, కులాల పేరుతో చిచ్చు రాజేస్తున్న, దేశ ప్రజలకు గుక్కెడు నీళ్ళు ఇవ్వని, దేశాన్ని అంధకారంలో నెట్టేస్తున్న, హిందూయిజం అంటూ కత్తులు దూస్తున్న దుర్మార్గ పాలనను అంతం చేసి దేశాన్ని పట్టి పీడిస్తున్న విషకోరల నుంచి విముక్తి చేయడానికి కేసీఆర్ నాయకత్వం రాక కోసం భారతావని సగర్వంగా స్వాగతం పలుకుతుంది. కేసీఆర్ ఇప్పటికే మోడీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో దేవెగౌడ, శరద్ పవార్, లాలూప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, నితీష్కుమార్, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్, ప్రకాష్కారత్, సీతారాం ఏచూరి, కుమారస్వామి, హేమంత్ సోరేన్ వంటి నాయకులతో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు. దేశ స్వరూపం పూర్తి స్థాయిలో నవీకరించాలని ఈ దేశం దిశ దశ మార్చేందుకు లోతైన వ్యూహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న అడుగు నవ భారత పునర్నిర్మాణానికి ముందడుగు.
చిటుకుల మైసారెడ్డి: 9490524724