హైదరాబాద్లోని జలవిహార్లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని తెలిపారు. బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలుకుతారని చెప్పారు.
10 వేల బైక్లతో భారీ ర్యాలీగా బేగంపేట, రాజ్భవన్రోడ్, నెక్లెస్ రోడ్ మీదుగా జలవిహార్ చేరుకోనున్నట్లు మంత్రులు వెల్లడించారు. యశ్వంత్ సిన్హాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని వారు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అహంకారపూరితంగా, నియంతృత్వంగా దేశాన్ని పాలిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. న్యాయ కోవిదులు, భారత విదేశాంగ విధానం తెలిసిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. యశ్వంత్ సిన్హాకు అద్భుతమైన స్వాగతం పలుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్యాదవ్, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్గౌడ్, బాలరాజ్యాదవ్, శైలేందర్, బాబురావు, కృష్ణగౌడ్, తదితరులు ఉన్నారు.