ములుగు : జిల్లాలోని వాజేడు ఏజెన్సీలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. గత నెలలో కొంగల అటవీ ప్రాంతంలో చెట్లపై చిరుతలు సంచరించడం కలకలం రేపింది. తాజాగా వాజేడు మండలంలోని దూలపురం రేంజ్ పరిధిలోని కొంగల దూలపురం అటవీ ప్రాంతంలో లేగదూడను చిరుత చంపినట్లు స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న దూలపురం అటవీ రేంజ్ అధికారి అనంత రామిరెడ్డి అటవీశాఖ బృందంతో మంగళవారం సంఘటన ప్రదేశానికి చేరుకొని ఆనవాళ్లను గుర్తించారు. చిరుత దాడిలోనే లేగదూడ మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. స్థానిక ప్రజలు ఆందోళన చెందవద్దని, వన్యప్రాణుల దాడిలో పెంపుడు జంతువులు మృత్యు బారిన పడితే తమకు సమాచారం అందించాలన్నారు.