సీనియర్ నటుడు అర్జున్ సర్జా దర్శకనిర్మాణంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. స్వీయ నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది. అగ్ర హీరో పవన్కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నివ్వగా, ప్రకాష్రాజ్ కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ సందర్భంగా అర్జున్ మట్లాడుతూ‘ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా నా కుమార్తె ఐశ్వర్య అర్జున్ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇదొక ఫీల్గుడ్ మూవీ. వినూత్న కథతో తెరకెక్కించబోతున్నాం. నా కుమార్తెను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’అన్నారు.
ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరిందని హీరో విశ్వక్సేన్ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.బాలమురుగన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నివేదిత అర్జున్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కమల్. కె.