న్యూఢిల్లీ: గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రైలు రద్దై దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థికి భారతీయ రైల్వే అసాధారణమైన సేవలను అందించింది. విద్యార్థి సత్యం గాధ్వి ఏక్తా నగర్ నుంచి వడోదరకు రైలు టికెట్ను బుక్ చేసుకున్నాడు, అక్కడి నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే, కుండపోత వర్షం కారణంగా రైల్వే ట్రాక్లోని కొంత భాగం దెబ్బతినడంతో అతడి రైలును రద్దు చేశారు.
సదరు విద్యార్థిని ఎలాగైనా రైలు సమయానికి వడోదర చేర్చాలని ఏక్తానగర్ రైల్వే సిబ్బంది సంకల్పించారు. అతడికి ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదర స్టేషన్ వరకు ప్రైవేట్ కారు బుక్ చేశారు. సత్యం రెండు గంటలు ప్రయాణించి, వడోదర చేరుకున్నారు. అక్కడినుంచి చెన్నై వెళ్లిపోయాడు. కాగా, రైల్వేలోని ప్రతి ప్రయాణికుడికి వారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలిసిందని సత్యం చెప్పారు. రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.