చాదర్ఘాట్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఓ కానిస్టేబుల్ అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. నిమ్స్, మలక్పేట యశోద దవాఖాన వైద్య బృందం ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి గుండెను అంబులెన్స్ ద్వారా నిమ్స్ దవాఖానకు చేర్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన వీర బాబు (34) కొండాపూర్లోని 18వ టీఎస్ఎస్పీ బెటాలియన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితం వీరబాబు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం యశోద దవాఖానలో చేర్చారు. పరిస్ధితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు దృవీకరించారు. దీంతో వీరబాబు అవయవాలను మరొకరికి దానం చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా జీవన్ధాన్ సిబ్బంది సౌజన్యంతో వీరబాబు గుండెను నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అమర్చడానికి సిద్ధమయ్యారు.
గ్రీన్ చానల్ ద్వారా మలక్పేట యశోద దవాఖాన నుంచి చాదర్ఘాట్, కోఠి, ఎంజె మార్కెట్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డికాపూల్, ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజాగుట్ట దవాఖానకు గుండెను అంబులెన్స్ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో తరలించారు. మలక్పేట యశోద నుంచి అంబులెన్స్ మధ్యాహ్నం 1:44 ని.లకు బయలుదేరి నిమ్స్ దవాఖానకు 1:56 ని.లకు చేరుకుంది. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్తో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిపేయడంతో కేవలం పన్నెండు నిమిషాల వ్యవధిలోనే మలక్పేట యశోద నుంచి నిమ్స్ దవాఖానకు చేరుకుంది.