రామాయణంలో కనిపించే స్త్రీ పాత్రల్లో అసాధారణ నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన ‘తార’ సమున్నతమైన వ్యక్తిత్వం కలదిగా కనిపిస్తుంది. సూక్ష్మబుద్ధి, ముందుచూపు, విశ్లేషణా సామర్థ్యం, వివేచన కలిగిన స్త్రీగా ఆమె ప్రవర్తన సార్వకాలికమై యాజమాన్య నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
శ్రీ రాముని ఆశ్రయించిన సుగ్రీవుడు.. వాలిని యుద్ధానికి పిలుస్తాడు. ఆగ్రహంతో ఊగిపోతూ యుద్ధానికి బయల్దేరుతున్న వాలిని నిలువరించే ప్రయత్నం చేస్తుంది తార. ఆ సందర్భంగా ఆమె చేసిన హిత బోధ, వాలి మరణానంతరం శ్రీరామునితో ఆమె మాట్లాడిన విధానం, సీతాన్వేషణలో జరిగిన ఆలస్యాన్ని భరించలేని లక్ష్మణునితో తార వ్యవహరించిన తీరు ఆమె ఆలోచనా విధానాన్ని, ప్రజ్ఞాపాటవాలను, చొరవను, సంభాషణా నైపుణ్యాన్ని, సమాచార సేకరణ, విశ్లేషణా సామర్థ్యాన్ని, ముఖ్యంగా వ్యక్తిత్వ పరిణతిని సర్వకాలీనం చేశాయి.
వాలి.. సుగ్రీవుడితో యుద్ధానికి బయల్దేరుతున్న సమయంలో, రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన తార యుద్ధం వద్దని సహేతుకంగా, తార్కికంగా భర్తను నిలువరించే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఆమె ‘ప్రతిభాన్విత దూరదృష్టికి’ చిహ్నంగా కనిపిస్తాయి. వాలి ధైర్య సాహసాలనూ, పరాక్రమాన్నీ ప్రశంసిస్తూనే… సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి పిలవడంలోని ఆంతర్యాన్ని గ్రహించమని చెబుతుంది. ‘అత్యంత పరాక్రమశాలియైన రాముడు.. సుగ్రీవునికి అభయం ఇచ్చి ప్రాపుగా ఉన్నాడు కాబట్టి, యుద్ధానికిది తగిన సమయం కాద’ని హెచ్చరిస్తుంది. సుగ్రీవుని యువరాజును చేసి అతనితో సంధిచేసుకోమని సూచిస్తుంది. జరగబోయే పరిణామాలను ఊహించ గలగడమే దూరదృష్టి కలిగిన నాయకుని ప్రతిభకు, నాయకత్వ పటిమకు గీటురాయి.
తారకు ఎదురైన పెద్ద సంక్షోభం వాలి మరణం. సాధారణ స్త్రీ అయితే భావోద్వేగాలకు లోనై రామసుగ్రీవులను శాపనార్థాలు పెట్టేది. కానీ, నిండుదనాన్ని కోల్పోని తార ఆవేశాన్ని పొందినా వివేకంతో ప్రవర్తించింది. అంతటి ఆవేదనలోనూ అల్పత్వాన్ని చూపలేదు. సంక్షోభాలు ఎదురైన సమయంలో కూడా భావోద్వేగాలపై నియంత్రణ కలిగిన నాయకులే విజయమార్గంలో నడుస్తారు. నిజానికి ‘తార’ అంటే ‘తరించాలనే కోరిక’. ఆ కోరికకు అడ్డుగా ఉన్నది మాయ. అదే వాలి. అందుకే వాలి అనే మాయ తొలిగిపోయాక మాత్రమే ఆమెకు శ్రీరాముని దర్శనం అయింది.
సీతాన్వేషణలో అలక్ష్యాన్నీ, ఆలస్యాన్నీ సహించని లక్ష్మణుడు సుగ్రీవునిపై మండిపడతాడు. ఆ సమయంలో సుగ్రీవుని భయాన్ని, లక్ష్మణుడి ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న తార మరోసారి తన విలక్షణతను చాటుకుంది. సుగ్రీవుణ్ని ఆపద నుంచి రక్షించాలనుకుంది. మధువు మత్తుతో కాళ్లు తడబడుతుండగా, చెదరిన కురులతో, జారిపోతున్న చీరతో, సంభోగ చిహ్నాలు కనిపిస్తుండగా వెళ్లి లక్ష్మణుని ముందుకు వచ్చింది. మూతలు పడుతున్న కన్నులు పైకెత్తి అనునయ స్వరంతో.. ‘సుగ్రీవుడు సీతాన్వేషణ పనిమీదే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో అనుకోని పరిస్థితులలో ఒక్కొక్కసారి ఆలస్యం తప్పదు. ధర్మం తెలిసిన వాడివి పరిస్థితులను అర్థం చేసుకోగలవు. వానరసైన్యం సాయం లేకుండా రాముడు సీతను అన్వేషించడం సాధ్యం కాదు. ఉచితజ్ఞుడవై కోపాన్ని నిగ్రహించుకొమ్మ’ని సాదరంగా పలికింది. మండుతున్న అగ్ని శిఖలా వచ్చిన లక్ష్మణుడు తార మాటలతో మంచులా కరిగిపోయాడు. ధైర్యానికి, దక్షతకు, భావోద్వేగాల నియంత్రణతో ప్రవర్తించడంలో, భావవ్యక్తీకరణ
విధానానికి, ఉదాత్త వ్యక్తిత్వానికి తార నిలువుటద్దంగా నిలుస్తుంది. ఆనాడే కాదు ఏనాటికీ ఆమె వ్యక్తిత్వం మహిళా తేజస్సుకు, వికాసానికి, వైభవానికి ఆదర్శప్రాయమని రామాయణం చాటుతున్నది.
పాలకుర్తి రామమూర్తి