నిజామాబాద్ : రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం రోడ్లు భవనాలు శాఖ మంత్రివేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన జిల్లాలోని వేల్పూర్ గ్రామంలో ప్రశాంత్ రెడ్డి తో కలిసి పర్యటించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠధామం, రైతు వేదికలను మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రకృతి వనంలో మంత్రులు మొక్కలను నాటారు.
వేల్పూరు గ్రామంలోని ఒక కిరాణా షాపు ముందు చెత్త ఉండటాన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి కిరాణా షాపు యజమానికి వంద రూపాయల జరిమానా విధించారు. గ్రామంలో పరిశుభ్రతపై గ్రామస్తులకు, షాప్ యజమానులకు అవగాహన కోసమే ఫైన్ విధించామని మంత్రి తెలిపారు. గ్రామంలో అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు.
ప్రతిరోజు ఉదయం ఇండ్లల్లో, రోడ్లపై పేరుకుపోయిన తడి, పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించాలని ఆయన గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి సూచించారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చామని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా జిల్లాలో 660 ప్రకృతి వనాలు, 521 వైకుంఠధామాలు, 529 డంపింగ్ యార్డ్ లు నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. అనంతరం వేల్పూర్ గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి కీ.శే. వేముల సురేందర్ రెడ్డి స్మారక చిహ్నం, విగ్రహాన్ని సందర్శించి మంత్రులు శ్రద్ధాంజలి ఘటించారు.