నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నారాయణదాస్ కె నారంగ్, పూస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరా పండక్కి అక్టోబర్ 5న విడుదలవుతున్నది. ఆదివారం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నాగ చైతన్య, అఖిల్ అతిథులుగా కర్నూలులో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత పూస్కుర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ…‘నాగార్జున ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. విభిన్న తరహా సినిమాలు చేశారు. ఈ చిత్రం కూడా అలాంటి విలక్షణమైనదిగా మిగిలిపోతుంది’ అన్నారు. ‘ఒక అభిమానిగా నాగార్జున తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో నాకు తెలుసు. కథ రాయడం నుంచి చిత్రీకరణ దాకా అభిమానిగానే ఈ చిత్రంలో ఆయనను చూపించాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమా రూపొందించాను.
ఈ చిత్రం మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. అఖిల్ మాట్లాడుతూ..‘30 ఏళ్ల కెరీర్లో నాన్నకు సినిమాల మీద ప్రేమ తగ్గడం లేదు. మా తరంతోనూ పోటీ పడుతున్నారు. మేము ఎంత కష్టపడాలో చూపించే స్ఫూర్తి నాన్నే. మనమంతా కోరుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’ అన్నారు. ‘యాక్షన్ సినిమాల్లో నాన్నను చూడటానికి ఇష్టపడతాను. అలాంటి సినిమా చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు థాంక్స్. ఆయన మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు’ అని నాగచైతన్య అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ…‘అన్నమయ్య’ చిత్రం కోసం కర్నూలు వచ్చాను. మళ్లీ ఇప్పుడే రావడం. నాకు యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. ఇలాంటి సినిమా చేసి చాలా కాలమవుతున్నది. కుటుంబంతో కలిసి చూసి ఆనందించే చిత్రమిది. అక్టోబర్ 5న దసరాకు మీ ముందుకు సినిమాను తీసుకొస్తున్నాం. విజయదశమి మనందరికీ విజయాలను ఇస్తుంది. అలాగే ఈ సినిమాకూ విజయం దక్కుతుందని నమ్ముతున్నా. త్వరలో అఖిల్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నా’ అన్నారు.