మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మద్దతు ధరపై కేంద్రమంత్రి బీఎల్ వర్మను తెలంగాణ రైతులు నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 ఎన్నికల సందర్భంగా రైతుల పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ మద్దతు ధర లభించడం లేదు. ఆ ఆవేదనను ఒక రైతు కేంద్రమంత్రి ముందు వ్యక్తంచేశాడు. సోమవారం కేంద్రమంత్రి బీఎల్ వర్మ మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు వచ్చారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన విస్సంపల్లి వీరన్న పలు అంశాలపై కేంద్రమంత్రిని నిలదీశారు. నేటికీ తమకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరివేస్తే పప్పుదినుసులు వేయమన్నారు. పప్పు దినుసులకు మద్దతు ధర ఎక్కడ వస్తుంది మాకు?’ అంటూ నిలదీశారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచడంవల్ల తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాగు ఇబ్బందిగా మారిందని చెప్పారు. ‘అన్ని పంటలకు గతంలో మేము ఎండోసల్ఫన్ పిచికారీ చేసేవాళ్లం. ఇప్పుడు దానిని రద్దు చేశారు.
దానిని బ్యాన్ చేయడం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు’ అని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేసిన మేలేంటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతోమేలు చేస్తున్నదని, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడతో పాటు ప్రతి వానకాలం, యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. ఇంత చేస్తున్న రాష్ట్రప్రభుత్వంపైనే కేంద్రమంత్రులు విమర్శలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రైతులకు మీరు చేసిందేమిటని నిలదీశారు. మార్కెట్లో ఉన్న 150 మంది రైతులు వీరన్నకు మద్దతుగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పుతున్నదని గమనించిన కేంద్రమంత్రి వర్మతోపాటు బీజేపీ నాయకులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.