నిర్మల్, జనవరి 6 : రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు బంధువు అయ్యారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం లక్ష్మణచాంద మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విద్యార్థినిలు, మహిళలు రైతు బంధు, సీఎం కేసీఆర్ ముగ్గులు వేసారు. ముగ్గులను ఆసక్తిగా తిలకించిన మంత్రి..విద్యార్థులను అభినందించారు. ముగ్గుల పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా రెండు పంటలకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.