న్యూఢిల్లీ, ఆగస్టు 18: డోలో గోలీలను రోగులకు సూచించాలంటూ.. వైద్యులకు సదరు తయారీ కంపెనీ రూ. 1,000 కోట్లను నజరానాగా ఇచ్చిన కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. దీన్ని తీవ్రమైన విషయంగా అభివర్ణించింది. పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘500 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉన్న గోలీల ధరల నిర్ణయం ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్న గోలీల ధరలపై నిర్ణయాధికారం తయారీ సంస్థలదే. దీన్ని ఆధారంగా చేసుకొనే డోలో 650 గోలీని తయారు చేస్తున్న మైక్రో ల్యాబ్స్ అవినీతికి పాల్పడింది.
రోగులకు తమ గోలీలను సూచించాలని డాక్టర్లకు రూ. 1,000 కోట్లు నజరానాగా ఇచ్చింది’ అని ఆరోపించారు. సీబీడీటీ దర్యాప్తులో కూడా ఇదే తేలిందని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్.. ‘మీరు మాట్లాడుతున్న విషయాన్ని మేము లోతుగా వినాలనుకుంటున్నాం. ఎందుకంటే కొవిడ్ సమయంలో నేను కూడా ఆ గోలీని వాడాను. ఇది నిజంగా తీవ్రమైన అంశం. మేము దీనిపై విచారిస్తాం’ అన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.