హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగలా ప్రారంభమైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేశారు.
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని ఘన్పూర్ రిజర్వాయర్లో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్థానిక ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ ఏడాది 26,778 చెరువుల్లో రూ.68 కోట్లతో 88.52 కోట్ల చేప పిల్లలను, రూ. 25 కోట్లతో 10 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
చేపపిల్లల పంపిణీ రెండు నెలలపాటు కొనసాగనున్నది. గతంతో పోలిస్తే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీలో మత్స్యశాఖ అధికారులు సమూలు మార్పులు చేశారు. అవకతవకలు జరగకుండా టెండర్ ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. గతంలో టెండర్దారుకీ, చేప పిల్లల ఉత్పత్తిదారులకీ మధ్య నోటరీపై లీజు ఉంటే సరిపోయేది. ఈ ఏడాది రిజిస్టర్డ్ లీజు డాక్యుమెంట్ను తప్పనిసరి చేశారు.
దీంతో టెండర్దారులు నిజమైన ఉత్పత్తిదారులతో ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా నాణ్యమైన చేపపిల్లలు అందుతున్నాయి. చేప పిల్లలను సరఫరా చేసే వాహనాల ట్రాకింగ్కు ప్రత్యేకంగా ‘మత్స్యమిత్ర’ యాప్ను రూపొందించారు. రాష్ట్రంలోని చెరువులన్నింటినీ జీపీఎస్ ద్వారా ట్యాగ్ చేశారు. చేపలకు అనుకూలమైన చెరువులను అధికారులు గుర్తించారు. రెండేండ్ల క్రితం 18 వేల చెరువుల్లో చేపలు వేయగా ఈ ఏడాది జీపీఎస్తో చెరువుల సంఖ్య 26,778కి పెరిగింది.
టెండర్ నిబంధనల్లోని మార్పులతో నిరుడుతో పోలిస్తే.. ఈ ఏడాది తక్కువ ధరకు టెండర్లు వేశారు. నిరుడు 30-40 ఎంఎం గల చేపపిల్లలకు కనిష్ఠంగా 0.55 పైసలకు టెండర్ ఖరారు కాగా (జిల్లాల వారీగా మారుతుంది) ఈ ఏడాది అది రూ. 0.36 పైసలకే ఖరారైంది. ఇక 80-100 ఎంఎం చేప పిల్లలకు సంబంధించి నిరుడు రూ.1.39కి టెండర్ ఖరారు కాగా ఈ ఏడాది ఇది 0.89 పైసలకే ఖరారైంది.
ఈ విధంగా నిరుడు 91 కోట్ల చేప పిల్లలకు రూ.81.84 కోట్లు ఖర్చు కాగా ఈ ఏడాది 88 కోట్ల చేప పిల్లలకు రూ.68 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం ధరతో పోలిస్తే.. ఈ ఏడాది సుమారు రూ.80 కోట్లు కావాలి. కానీ అధికారుల చర్యలతో అది రూ.68 కోట్లకే పరిమితమైంది. తద్వారా ప్రభుత్వానికి రూ.12 కోట్లు ఆదా అయిందని అధికారులు చెప్తున్నారు. నకిలీ డ్యాక్యుమెంట్లు, నకిలీ బ్యాంక్ గ్యారంటీలపై అధికారులు ఈ ఏడాది కొరడా ఝులిపించారు. ఒక్కొక్క టెండర్ దరఖాస్తును రెండు మూడుసార్లు పరిశీలించి అన్ని పత్రాలు ఒరిజినల్ అని నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లారు.