పరిరక్షణపై ఆర్కియాలజీ విభాగం దృష్టిపెట్టాలి: వారసత్వ దినోత్సవంలో డాక్టర్ జైకిషన్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): దక్కన్ ఫిరంగులు చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకోవాలని ప్రముఖ ఆర్కియో మెటలర్జిస్ట్ డాక్టర్ జైకిషన్ అన్నారు. ఆర్కియాలజీ విభాగం వీటి పరిరక్షణపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నాంపల్లి తెలుగు వర్సిటీలో సదస్సును నిర్వహించారు. భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ చైర్మన్, సాలార్జంగ్ మ్యూజియం బోర్డు డైరెక్టర్ డాక్టర్ జైకిషన్ ‘దక్కన్ ఫిరంగులు -ది నెగ్లెక్టెడ్ బ్యూటీస్’ అంశంపై ప్రసంగించారు.
తెలంగాణలోని వేర్వేరు స్థలాల్లో వెయ్యి వరకు ఫిరంగులున్నాయని అన్నారు. దక్కన్ ఫిరంగులను కాపాడుకునేంద కు ఎన్జీవోలు సైతం ముందుకురావాలన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత కుమార్ మాట్లాడుతూ వారసత్వ సంపద రక్షణ కోసం పౌరసమాజాన్ని జాగృతం చేయాలన్నా రు. తెలుగు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేష్, ఆచార్య వెంకట్రామయ్య, జోగినాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, చరిత్రకారుడు డాక్టర్ ఎంఎన్ శ్రీనివాసన్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.