హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో పాడి రంగం కుదేలవుతున్నది. పాలు, పాల పదార్థాలపై జీఎస్టీ మోపి ఆ రంగంపై తీరని దెబ్బకొట్టిన బీజేపీ సర్కారు.. పశువులు తినే దాణాపైనా జీఎస్టీ విధించింది. తౌడు, కొబ్బరిపిండి, మక్కపిండి, పెసరపొట్టు ఇతర దాణాపై 5 శాతం జీఎస్టీ విధించటంతో పాడి రైతు లబోదిబోమంటున్నాడు.
ఇప్పటికే ఇల్లు గడవటానికే అష్టకష్టాల పడుతున్న తమకు.. పశువుల దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు గుదిబండలా మారాయని గోడు వెళ్లబోసుకొంటున్నాడు. పశువుల దాణా ధరలు కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్టు మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో క్వింటా తౌడు రూ.3 వేలు, కొబ్బరి పిండి రూ.5 వేలు, మకపిండి, పెసర పొట్టు రూ. 2,300, పత్తి పిండి రూ.3,800, గోధుమలు రూ.2,400, బబ్బెర పొట్టు రూ.2,450 చొప్పున ఉండగా, గతంలో ఉచితంగా లభించిన వరి గడ్డి.. ప్రస్తుతం ఒక గడ్డి కట్ట రూ.150 పలుకుతున్నది.
అయితే, దానికి తగ్గట్టు పాలు సేకరించే సంస్థలు పాల ధరకు పెంచటం లేదని, పాల ఉత్పత్తి భారంగా మారుతున్నదని రైతన్న వాపోతున్నాడు. కేంద్రం విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పాడి రంగంపై రైతులు అనాసక్తి కనబరుస్తున్నారు. మోదీ సర్కారు తీరుతో విసిగివేసారిన పాడి రైతులు ఈ మధ్య జంతర్మంతర్ వద్ద నిరసన కూడా చేపట్టారు. దాణాపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
పాల ఉత్పత్తి తగ్గిపోవటంతో రాష్ట్రానికి రోజూవారీగా అవసరమైన పాల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తున్నది. పశువులకు అవసరమైన దాణా, కొబ్బరిపిండి, మినపపొట్టు, వరిగడ్డి ధరలు అధికంగా పలుకుతుండటంతో పశుపోషణ భారంగా మారిందని పాడి రైతులు వాపోతున్నారు. ఒక గేదెకు రెండు పూటలా కలిపి 12 కిలోల దాణా పెడితే ఒక పూటకు 7 నుంచి 8 లీటర్ల పాలు ఇచ్చేది. కానీ ప్రస్తుతం ఒక పూటకు 4 – 6 లీటర్లు మాత్రమే ఇస్తున్నదని.. దాణా ఖర్చు పెరగటం, దిగుబడి తగ్గటంతో నష్టం వస్తున్నదని రైతులు చెప్తున్నారు.
పాల ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించి రాష్ట్ర అవసరాలకు పాలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని భావించిన తెలంగాణ సరారు లీటర్కు రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇన్సెంటివ్ ప్రభుత్వం చెల్లించింది. ములనూరు, కరీంనగర్ డెయిరీల్లో రైతులకు కూడా రూ.4 ఇన్సెంటివ్ చెల్లిస్తున్నారు.