దేశంలో ఒకే ఒక రైతు నేత కేసీఆర్
దేశంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో మాత్రమే సాధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావటం ఎంతో సంతోషంగా ఉన్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ సేవలు ఢిల్లీకి అవసరం ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు రైతుల బాధలు తీర్చాయి. ఈ తెలంగాణ మాడల్ దేశవ్యాప్తం కావాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు దోచి పెట్టడమే తప్ప.. రైతుల కోసం ఆలోచించడం లేదు. యువతకు ఉపాధి కరువైతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం బాగుపడాలన్నా, తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
తెలంగాణ దారిలో దేశం నడవాలి
తెలంగాణను సీఎం కేసీఆర్ బాగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజాపోరాటాల నుంచి వచ్చిన నాయకుడు కనుక ప్రజల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. రైతులకు కావలసిన సాగునీరు, పంట పెట్టుబడికి ఎకరాకు రూ.10 వేలు, రైతు బీమా ద్వారా రూ.5 లక్షలు అందించే వినూత్న విధానం దేశంలో మరెక్కడా లేదు. వ్యవసాయ అనుబంధ రంగాలనూ కేసీఆర్ విస్మరించలేదు. కులవృత్తులను ఆదుకొని ప్రోత్సహించి గౌరవాన్ని ఇచ్చారు. దళితులను వ్యాపార వేత్తలుగా మార్చాలనే కేసీఆర్ కృషి చాలా గొప్పది. మా దగ్గర (ఉత్తరప్రదేశ్లో) దళితులను ఇప్పటికీ మనుషులుగా చూసే వాతావరణమే లేదు. దశలవారీగా అర్హులైన దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సహాయం చేయటం అనేది విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం. ఇవన్నీ కేసీఆర్తోనే సాధ్యమయ్యాయి. అందుకే దేశానికి తెలంగాణ మాడల్, కేసీఆర్ ఆలోచనా విధానం కావాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి తప్పకుండా విజయం సాధిస్తారు.
-సుబేసింగ్ డాగర్, బీకేయూసీ, ఉత్తరప్రదేశ్
రైతులు, పేదల గోస తీర్చాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావడాన్ని, జాతీయ పార్టీ ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఆయన వెంట ఉండేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రైతులు, పేదల బాధలను తీర్చాలి. కేసీఆర్ గురించి చాలా విన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి తెలుసుకొన్నాం. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు చేయాలి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతులకు, పేదలకు ఎంతో లాభం జరుగుతుంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, ఉచిత విద్యుత్తు పథకాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ దేశవ్యాప్తంగా అమలైతే రైతుల కష్టాలు తొలగిపోతాయి. దళితబంధు పథకం ఎంతో ఆదర్శంగా ఉన్నది. ఈ పథకంపై మా ప్రాంతంలోనూ విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ పథకం ద్వారా దళితుల జీవితాల్లో వికాసం వస్తున్నది. ఇలాంటి పథకం దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ సర్కారు రైతుల విరోధి. రైతులకు నష్టం చేస్తూ.. కార్పొరేట్లకు లాభం చేసేలా మోదీ ప్రభుత్వ తీరు ఉన్నది. దేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. వారి అరాచకాలు పోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే.
– రాఘవేంద్ర కుమార్, రైతుసంఘం నేత, మధ్యప్రదేశ్
దేశానికి కేసీఆర్ సేవలు అవసరం
దేశ రాజకీయాల్లోకి రావాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన చాలా మంచిది. ఆయన జాతీయ పార్టీని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం అత్యవసరం. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో రైతులకు మేలు జరగాలంటే… సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– దినేశ్ కుమార్ శుక్లా,రైతు సంఘం నేత, ఉత్తరప్రదేశ్
దేశ రైతుల్లో సంబురం
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రస్తుత బీజేపీ సర్కారుతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎనిమిదేండ్లలో రైతులకు చేసిందేమీ లేదు. అదే తెలంగాణలో కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అలాంటి పథకాలు మాకు కూడా కావాలని మా రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాం. ఒకవేళ కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు దేశమంతా అమలవుతాయి. పంటలను తెలంగాణలో మొత్తం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే… దేశ వ్యాప్తంగా రైతులకు పంటల కొనుగోలుపై భరోసా దక్కుతుంది.. మద్దతు ధర అందుతుంది.
రైతుల కన్నీళ్లు, కష్టాలకు ఇక సెలవు
దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు తేవడానికి, రైతులను ఆదుకోవడానికి జాతీయ రాజకీయాల్లో ముందడుగు వేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలుస్తాం. ఆయన నిర్ణయంతో దేశంలో రైతుల కష్టాలు, కన్నీళ్లకు ఇక ముగింపు పలికినట్టే. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు పథకాల వైపు యావత్ దేశం చూస్తున్నది. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుకొంటున్నది. ఇందుకోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని మెజార్టీ రైతులు, రైతు కుటుంబాలు కోరుకొంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుతో రైతులకు కష్టాలే మిగిలాయి. పేదల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే.. రైతుల పంటలకు మద్దతు ధర దొరుకుతుంది. ప్రభుత్వమే మొత్తం పంటలను కొనుగోలు చేస్తుంది. పెట్టుబడి సాయం అందుతుంది. రైతులను ప్రైవేటు అప్పుల బారి నుంచి రక్షిస్తారు.
-పాకాల శ్రీహరిరావు, తెలంగాణ రైతు రక్షణ సమితి
కేసీఆర్ కోసం దేశం ఎదురుచూస్తున్నది
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం అత్యవసరం. ఆయనకోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్నది. రైతులు, పేదలు, అణగారిన వర్గాలు, బీజేపీ పీడిత వర్గాలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నాయి. దేశమంతా కేసీఆర్ వైపు చూడటానికి బలమైన కారణం ఉన్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకులాలు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. వాటన్నింటి కోసం దేశ ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం రైతుల్లో సంతోషం నింపింది.
-కోటపాటి నర్సింహ నాయుడు, దక్షిణాది రైతు సంఘాల అధ్యక్షుడు.
రైతు బాంధవుడు కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. 75 ఏండ్ల పాలనలో ఏ ప్రభుత్వం కాని, ఏ నాయకుడు కాని కేసీఆర్ మాదిరిగా రైతు సంక్షేమ చర్యలు చేపట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సహాయం అందిస్తుండటం గొప్ప విషయం. బీజేపీ మాడల్ విఫలమైంది. తెలంగాణ మాడల్ ఆదర్శనీయం. బీజేపీ సర్కార్ను గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. బీజేపీ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగట్టడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడు బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి పూనుకోవడం అభినందనీయం.
-శివకుమార్శర్మ, ఐక్య రైతు సమితి నాయకుడు, భోపాల్, మధ్యప్రదేశ్.
వ్యవసాయ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యం
ఎన్నో ఏండ్లుగా కేంద్రంలో పరిపాలన చేస్తున్న పార్టీలకు ప్రాధాన్యతాంశాల్లో వ్యవసాయరంగం లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఏ పార్టీలు కూడా వ్యవసాయాన్ని, రైతులను బాగు చేయడంపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్, దేశ వ్యవసాయరంగానికి ఓ ఆధారంలా కనిపిస్తున్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల దేశ వ్యవసాయరంగం కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఆహార భద్రతను అధిగమించి, దేశ వ్యవసాయరంగాన్ని ప్రపంచానికి పోటీదారుగా చేయగలిగే సత్తా సీఎం కేసీఆర్లో ఉన్నది. జాతీయ పార్టీ నిర్ణయం దేశ రైతాంగానికి ఓ శుభపరిణామం.
– చెంగల్రెడ్డి, రైతు ఉద్యమ నేత
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
కేంద్రంలోని బీజేపీ సర్కారును ఎంత తొందరగా గద్దె దించితే దేశ ప్రజలకు అంత మంచిది. మతతత్వాన్ని పెంచడమే కాకుండా రాష్ర్టాల హక్కుల్ని కాలరాస్తూ ఫాసిజం వైపు వెళ్తున్నది. నా 60 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇన్ని దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా, వారి ఫాసిజంను నిలువరించేందుకు దేశవ్యాప్తంగా ఒక సంఘటన ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది. బీజేపీపై పోరుకు ఎవరో ఒకరు ముందుండాలి. ఒక పార్టీ కూడా అవసరం ఉన్నది. ఇలాంటి అవసమైన పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడం శుభపరిణామం. ఈ పోరులో సీఎం కేసీఆర్ పాత్ర చాలా కీలకం. విచ్ఛిన్న శక్తులతో ఆయన జాగ్రత్తగా ఉండాలి.
– సారంపల్లి మల్లారెడ్డి, రైతు ఉద్యమకారుడు
కేసీఆర్కు మద్దతుగా నిలుస్తాం
కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం. టీచర్లు, కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్ నిలుస్తారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ ఇంతకాలం అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాల కోసం పనిచేశాయి. రాజకీయ నాయకుల్లో స్వార్ధం పెరిగిపోయింది. ఒకరిని మరొకరు విమర్శించుకోవడమే రాజకీయంగా మారింది. విధానాలు, పాలసీల మీద చర్చ జరగడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం మీద ఆధారపడింది. వ్యవసాయానికి అందాల్సిన సహకారం అందడం లేదు. సామాన్యుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు దాసోహమవుతున్నాయి. ఎవరికి గవర్నెన్స్ అవసరమో వారికి అందడం లేదు. ఎవరికి అవసరం లేదో వారి ముందు ప్రభుత్వాలు మోకరిల్లుతున్నాయి. రాజస్థాన్లో ఒక పార్టీ ఒక పర్యాయం.. మరో పార్టీ మరో పర్యాయం ఏలుతున్నాయి. ఒకరిని విమర్శించిన వారే తిరిగి అధికారంలోకి రాగానే వాటినే కొనసాగిస్తున్నారు. దీనికి కేసీఆర్ చరమగీతం పాడితే అందరి మద్దతు లభిస్తుంది. ఉపాధ్యాయులు, కార్మికుల పక్షాన ఉండే మేము మద్దతునిస్తాం. మాకు 20 రాష్ర్టాల్లో ఉపాధ్యాయ సంఘాల అనుబంధం ఉన్నది. దేశహితం కోరేవారికి సపోర్ట్గా ఉంటాం.
– చగన్ లాల్ రోజ్ (సీఎల్ రోజ్), ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ సెక్రటరీ జనరల్