హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యం ఏదో ఒక అం శంలో రాష్ట్రప్రభుత్వాన్ని చికాకు పరుస్తుండగా, పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రగతిని నిరోధించే చర్యలకు పాల్పడుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తికాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలంగాణవాదులు అనుమానిస్తున్నారు.
4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న వైటీపీఎస్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై) ఊహించని విధంగా తిరిగి అధ్య యనం చేయాలంటూ తీర్పునివ్వటం.. అది కూడా చిన్నచిన్న విషయాలను కారణాలుగా చూపుతూ 9 నెలల్లో అధ్యయనం పూర్తిచేయాలని ఆదేశించటం అనుమానాలకు తావిస్తున్నది. నిర్మా ణ పనులు పూర్తిచేసినా అధ్యయనం పూర్తయ్యేవరకు విద్యుత్తును ఉత్పత్తి చేయవద్దంటూ తీర్పు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అదికూడా సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పును దసరా రోజు అక్టోబర్ 5న బహిరంగ పర్చడం గమనార్హం.
సుమారు రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న వైటీపీఎస్కు కేంద్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ నుంచి ఈసీ (ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్) 29-06-2017న పర్యావరణ అనుమతులు ఇచ్చింది. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం వైటీపీఎస్ నిర్మాణ పనులను చేపట్టింది. అయితే ముంబైకి చెందిన ది కన్జర్వేషన్ ఆఫ్ యాక్షన్ ట్రస్ట్ అనే సంస్థ చెన్నై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ వేయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని, దాని వెనుక ఉండి నడిపిస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని తెలంగాణ విద్యుత్తు సంఘాల ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈసీ ఇచ్చినప్పటికీ కొన్ని అంశాలపై అధ్యయనం చేయాలని బుధవారం ఇచ్చిన తీర్పులో ఎన్జీటీ పేర్కొన్నది.
చెన్నై ఎన్జీటీ ఇచ్చిన తాజా తీర్పులో భారత ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం గానీ.. భవిష్యత్తులో అటవీ భూములను బదలాయింపు చేయకూడదు. ముఖ్యంగా థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులు, అటామిక్ ప్లాంట్లు, రెడ్ క్యాటగిరీలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వకూడదని తెలిపింది. తెలంగాణ జెన్కోకు ఇచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ను.. తాము ఇచ్చిన మార్గదర్శకాల మేరకు.. సాధారణ నిర్మాణ పనులు చేసుకోవచ్చని పేర్కొన్నది. అయితే విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించకూడదని, భారీ యంత్రాలను ఏర్పాటు చేయకూడదని ఆదేశించింది. తాము ఇచ్చిన మార్గదర్శకాలమేరకు తదుపరి జరిగే అధ్యయనం నివేదికను పరిశీలించిన తరువాత కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇచ్చే ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతుందని పేర్కొన్నది.
చెన్నై ఎన్జీటీ ఇచ్చిన తీర్పులో మరోసారి అధ్యయనం చేయాలంటూ పేర్కొన్న అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. రేడియో ధార్మికత ప్రభావంపై అధ్యయనం చేయాలని, యాష్ పాండ్స్ సరిపోయినన్ని ఉన్నాయా? వాటి డిజైన్లు, నిర్వహణ, ప్రాజెక్టు చుట్టుపక్కల 25 కిలోమీటర్ల మేర గాలి నాణ్యత, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు ఈ ప్రాజెక్టు సరిగ్గా ఎంత దూరంలో ఉన్నది? అనే అంశాలపై అధ్యయనం చేయాలని టీఎస్ జెన్కో, ఈఏసీ, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది.
నిజానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైటీపీఎస్ వద్ద 10 కిలోమీటర్ల రేడియస్లో గాలి నాణ్యతపై అధ్యయనం చేసి కేంద్రానికి సమర్పించింది. దానిని కేంద్రం పరిశీలించి ఆమోదించిన తరువాతనే పర్యావరణ అనుమతులు ఇచ్చారు. అలాగే రేడియో యాక్టివిటీపై కూడా నివేదిక ఇచ్చారు. యాష్ పాండ్లను కూడా కేంద్ర విద్యుత్తు నియంత్రణ, పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలమేరకే నిర్మిస్తున్నారు. ఇక అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు (ఏటీఆర్)కు దామరచర్లకు మధ్య చాలా దూరం ఉన్నది. కోర్టు మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే నిబంధనల ప్రకారమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే ముంబైకి చెందిన సంస్థతో పిటిషన్ వేయించి, ఎన్జీటీలో తెలంగాణను ఇరుకునపెట్టే తీర్పు వచ్చేలా కేంద్రం, ఏపీ సర్కారు మంత్రాంగం నడిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్తు ఉత్పత్తి చేయవద్దనటం వెనుక తెలంగాణకు విద్యుత్తు రాకుండా అడ్డుకొనే కుట్ర ఉన్నదని విద్యుత్తు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.