న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశంలోని రైతులు ఎంతగా వ్యతిరేకిస్తున్నా విద్యుత్తు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తున్నది. నవంబర్-డిసెంబర్ మధ్య జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. వాస్తవానికి ఈ బిల్లును వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టగా, పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దీక్ష చేసిన విషయం తెలిసిందే. వీరిని దీక్ష విరమింపజేసే సమయంలో విద్యుత్తు సవరణ బిల్లుపై రైతు సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రవేశపెడుతామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఈ బిల్లుపై చర్చించేందుకు ఇప్పటివరకు వారితో ఒక్కసారి కూడా చర్చలు జరుపలేదు.