హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, ఇది ముమ్మాటికీ దేశ ద్రోహ పూరిత చర్య అని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలను 30 రోజుల్లోగా తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు చెల్లించాలంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేయడంపై జగదీశ్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను చీకట్లోకి నెట్టాలని కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.
విభజన తరువాత తెలంగాణకు ఏపీ నుంచి విద్యుత్తు సరఫరా చేసినందున మొత్తం రూ.3441.78 కోట్లు అసలు, లేట్ పేమెంట్ సర్చార్జ్గా రూ.3,315.14 కోట్ల బకాయిలు (2.6.2014 నుంచి 10.6.2017 వరకు) చెల్లించాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి విజ్ఞాపన అందిన నేపథ్యంలో తమకున్న అధికారాలను ఉపయోగించుకొని, 30 రోజుల్లో ఆ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఆదేశించడంపై మంత్రి స్పందించారు.
ఏపీ నుంచి తెలంగాణకు రూ.12,900 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నదని మొరపెట్టుకొన్నా కేంద్రం స్పందించలేదని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. విద్యుత్తు సరఫరాతోపాటు బకాయిలు, పీపీఏలలోనూ తెలంగాణకు ఏపీ నష్టమే చేసిందని అన్నారు. ఈ వివాదంలో ఒక్కరోజు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామంటూ మోదీ చెప్పిన మాట దక్కేలా లేదని మంత్రి విమర్శించారు.
గుజరాత్ సహా అన్ని రాష్ర్టాల్లో విద్యుత్తురంగం సంక్షోభంలో పడిందని, దేశ రాజధాని సహా అన్ని రాష్ర్టాల రాజధానుల్లో విద్యుత్తు కోతలు తప్పడం లేదని చెప్పారు. తెలంగాణలో మాత్రమే ఏ వర్గానికి కూడా కోతలు లేకుండా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు అందుతున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సాధించిన ఈ విజయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదని దుయ్యబట్టారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుకు అడ్డుపుల్ల వేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ ఆదేశాలని మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
పునర్విభజన చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ప్రశ్నించారు. ఏపీ నుంచి రూ.12,940 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉన్నదని, కానీ, ఈ రోజు కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, 30 రోజుల్లో బకాయిలను ఏపీకి చెల్లించాలంటూ తెలంగాణకు ఆదేశాలిచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నెల రోజుల్లో చెల్లించాలనడం ముమ్మాటికీ దుర్మార్గమే. జాతీయ ప్రభుత్వంగా చెయ్యాల్సింది కాదు. తెలంగాణను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు. మోటర్లకు మీటర్లు పెట్టనని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే కేంద్రం ఈ దుశ్చర్యకు దిగింది. కేంద్రానికి ఏపీ లేఖలే కనపడుతున్నాయి. తెలంగాణ లేఖలను మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదు’ అని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.