తిరుపతి, 2021 మే 25: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు ఆలయంలోని వేద ఆశీర్వాద మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ మధు, ఇతర అధికారులు పాల్గొన్నారు.