మేడ్చల్ మల్కాజిగిరి : శామీర్పేట చెరువులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జిల్లాలోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అలియాబాద్ వీఆర్ఏగా పనిచేస్తున్న భరత్ చెరువు నీరు వదిలే క్రమంలో అలియాబాద్ తూం వద్దకు చేరుకున్నాడు. నీళ్లు తక్కువగా రావడంతో తూము వద్ద కర్ర సహాయంతో చెత్తను తొలగించసాగాడు. తూము వద్ద నీటిలో బోర్లాగా తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు తూములో చిక్కుకున్న మహిళ శవాన్ని వెలికి తీయగా.. గత రెండు రోజులుగా కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉంటున్న ఓ వృద్ధురాలిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.