హైదరాబాద్, ఆగష్టు 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడం దుర్మార్గ చర్య అని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరాధారమైన ఆరోపణల నేపథ్యంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. సంస్కృతి, సంప్రదాయాల గురించి పదే పదే మాట్లాడే బీజీపీ నాయకులు మహిళా నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకొంటారని ప్రశ్నించారు.
మంత్రులు శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపిన వారిలో విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, నన్నపునేని నరేందర్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కాలె యాదయ్య, రేఖానాయక్, ఆరూరి రమేశ్, ఎమ్మెల్సీలు దండె విఠల్, పట్నం మహేందర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. సెర్ప్, ఐకేపీ సంఘాల ప్రతినిధులు శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో కవితను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మీద ఆరోపణలు చేస్తే సీఎం కేసీఆర్ భయపడతారని బీజేపీ నేతలు అనుకుంటున్నారని, అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సెర్ప్, ఐకేపీ డిపార్ట్మెంట్ మీద అందరికీ ప్రత్యేకమైన గౌరవం ఉందని, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలనుకునే మహిళలకు సెర్ప్ సిబ్బంది మద్దతుగా నిలుస్తున్నారని ఆమె ప్రశంసించారు. తెలంగాణలో పేదరికం తగ్గుతున్నదని, అన్నివర్గాల మహిళలకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని చెప్పారు. సెర్ప్ ఉద్యోగుల క్యాడర్ పెంచే అంశం సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నదని తెలిపారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో బలముందని, తెలంగాణలో మరొక రాజకీయ పార్టీకి అవకాశం లేదనే విషయం బీజేపీకి అర్థమైందని అన్నారు. దీంతో బీజేపీ నేతలు ఏదో ఒక వివాదం సృష్టించి, కొన్ని ఓట్లు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నదని కవిత ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సెర్ప్, ఐకేపీ సంఘాల నాయకులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.